రాష్ట్రంలో అటు అధికార పక్షం వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక సంస్థల ఎన్ని కలకు ఆరు వారాలు వాయిదా విధిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. రమేశ్ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరికి వారు పాజిటివ్గా మార్చుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో ఆది నుంచి కూడా ఎన్నికలను వాయిదా వేయాలని అభిలషిస్తున్న టీడీపీ నాయకులు తమ శ్రేణులను మరింత ఉత్తేజం చేసుకునేందుకు ఈ ఆరు వారాల సమయం తమకు ఎంతో లాభిస్తుందని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీ కీలక నాయకులు కూడా ఎన్నికలను వాయిదా వేయాలని కోరుకున్నారు.
వారు కోరుకున్నట్టుగా జరిగిందో.. లేక యాదృచ్చికంగా జరిగిందో స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేశారు. దీంతో ఇప్పటి వరకు పెద్దగా వ్యూహం లేని టీడీపీ ఇప్పుడు వ్యూహంపై కన్నేసింది. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను బలోపేతం చేసే దిశగా అప్పుడే చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి చంద్రబాబు రాత్రికిరాత్రి రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చించారని తెలిసింది. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్న నాయకులను మరింత ఉత్తేజం చేసే దిశగా ఆయన దిశానిర్దేశం చేశారని అంటున్నారు. అయితే, నిజంగానే టీడీపీ ఈ ఆరు వారాల ఎఫెక్ట్ కనిపిస్తుందా? లేక ఎన్నివారాలు పెంచినా పరిస్థితిలో మార్పు రాదా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణం.. ఇటీవల పార్టీ నుంచి భారీ స్థాయిలో నాయకులు పక్కకు తప్పుకొన్నారు. అదే సమయంలో ఆర్థికంగా కూడా స్థానిక ఎన్నికల్లో ఖర్చుకు వెనుకాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరు వారాల గడువు పెంచినా తమకు పెద్దగా లాభం ఉండదని చాలా మంది నాయకులు చెబుతున్నట్టు తెలిసింది. ఇక, చంద్రబాబు నుంచి కూడా ఆయా నాయకులకు భరోసా వస్తున్నా.. అది పైపైకి పార్టీని గెలిపించుకునేందుకు మాత్రమే కనిపిస్తోందని అంటున్నారు. ఆరు వారాల పాటు ఎన్నికలకు బ్రేక్ వచ్చినా.. ప్రక్రియలో మార్పు రాలేదని, దీనిని బట్టి.. ఎన్నికలను వాయిదా వేయడం మంచిది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఇప్పటికే అన్నీ సిద్ధం చేసుకున్నామని, ఇప్పుడు ప్రక్రియను వాయిదా వేయడం వల్ల ఖర్చు మరింతగా పెరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరు వారాల గడువును తమ్ముళ్లు పెద్ద సీరియస్గా తీసుకోవడం లేదు. పైగా కార్యకర్తలు ఇప్పుడు వెళ్లిపోతే..తిరిగి వస్తారో రారో అనే బెంగ కూడా వారిని వెంటాడుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.