ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ ని కూడా షేక్ చేస్తుంది. ఇప్పటికే భారత్లో కరోనా కేసుల సంఖ్య 128కి చేరినట్లు మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపారు. అంతే కాదు ఈ కరోనా భారిన పడి ముగ్గురు మృతి చెందారు. ఈ కరోనా వల్ల ప్రాణాలు అరచేతిలో బతికే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.. కారణం రోజు రోజు కీ పెరిగిపోతున్న కేసులే. భారత్ లోనూ ఇది క్రమంగా ఉనికిని చాటుకుంటోంది. అత్యధికంగా మహారాష్ట్రలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ (24) ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ లో 14, కర్ణాటకలో 11 మంది కరోనా బాధితులు ఉన్నట్టు గుర్తించారు.
తెలంగాణలో 3 కేసులు నమోదు కాగా, వారిలో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాదులో ఒక మరణం సంభవించినా అది కర్ణాటక ఖాతాలోకి వెళ్లింది. కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడికి కరోనా సోకగా మెరుగైన చికిత్స కోసం అతని కుటుంబసభ్యులు హైదరాబాద్ తరలించారు. తాజాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికీ కరోనా వైరస్ సోకలేదని తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోమారు స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర దేశాలు దుబాయ్, ఇటలీ, స్కాట్లాండ్, నెదర్లాండ్, ఇండోనేషియానుంచి వచ్చిన ఐదుగురు వ్యక్తులకే ‘కరోనా’ పాజిటివ్ గా ఉందని అన్నారు.
‘కరోనా’ పాజిటివ్ గా ఉన్న వ్యక్తుల నుంచి మరెవరికీ ఈ వైరస్ సోకలేదని, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ‘కరోనా’ లక్షణాలు లేని వారిని క్వారంటైన్ లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ‘కరోనా’ కేసులకు సంబంధించిన సమాచారాన్ని బులెటిన్లు ద్వారా విడుదల చేస్తామని చెప్పారు. కరోనా గురించి ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన శిక్షలు అమలవుతాయని అన్నారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరారు