వై.ఎస్‌. ఫ్యామిలీపై టీడీపీ నేత నారా లోకేశ్ కుట్ర చేశారా... టీడీపీ అధికారంలో ఉన్నప్పడు కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారా.. ఎలాగైనా సరే వైఎస్ ఫ్యామిలీని ఓడించి బలం నిరూపించుకునేందుకు కుట్ర చేశారా.. అంటే అవునంటున్నారు ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి. ఆయన ఇటీవలే వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ గుట్లన్నీ విప్పి చెబుతున్నారు.

 

 

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించడానికి ఎంపీటీసీలను డబ్బుతో కొనాలని టిడిపి నారా లోకేష్ తమకు చెప్పారని రామసుబ్బారెడ్డి బయటపెట్టారు. కడప జిల్లాలో వైసీపీకి అత్యధిక సంఖ్యలో ఎంపీటీసీలు ఉన్నా... డబ్బుతో ఓటర్లను కొని వివేకాను ఓడించారని రామసుబ్బారెడ్డి వెల్లడించారు. కానీ ఇప్పుడు సీఎం జగన్‌ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

 

 

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ మీద నమ్మకం లేకనే మంచి నాయకులంతా పోటీ చేయలేదని రామసుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. రాష్ట్రం కోసం సీఎం జగన్‌ చేసే ఆలోచనలు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్‌ మీద బురద చల్లాలని చూస్తే దేవుడే వారికి బుద్ధి చెబుతాడని రామసుబ్బారెడ్డి చెబుతున్నారు.

 

 

అయితే పార్టీ మారిన తర్వాత నాయకులు ఇలాంటి విషయాలు చెబుతూనే ఉంటారు. పార్టీ మారక ముందు చెబితే విశ్వసనీయత ఉంటుంది. కానీ అప్పుడు చెప్పలేరు.. ఇప్పుడు పార్టీమారక చెబితే జనం పార్టీ మారాడు కాబట్టి చెప్పాడనుకుంటారు. ఏది ఏమైనా కడప జిల్లాలో వైసీపీని దెబ్బ తీసేందుకు నారా లోకేశ్ ఇంత పని చేశాడంటున్నారు రామసుబ్బారెడ్డి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: