వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో ఏపీ గళం వినిపించారు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. విశాఖ-బెంగుళూరు మధ్య డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసును ప్రారంభించాలని ఎంపీ విజయ సాయి రెడ్డి రాజ్యసభలో రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో రైల్వేల పనితీరుపై జరిగిన చర్చలో ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రసంగించారు.

 

 

విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు రోజువారీ నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసు కావాలన్నది ఎంతోకాలంగా విశాఖపట్నం ప్రజల కోరిక అని ఎంపీ విజయ సాయి రెడ్డి చెప్పారు. విశాఖ నుంచి బెంగుళూరుకు ప్రయాణించే ఐటీ నిపుణులకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించిన విశాఖపట్నం-వారణాసి-అలహాబాద్‌ రైలు సర్వీసును కూడా త్వరగా ప్రారంభించాలని ఎంపీ విజయ సాయి రెడ్డి కోరారు.

 

 

అంతే కాదు.. ఇటీవల రెఫ్రిజిరేటెడ్‌ కంటైనర్లు కలిగిన రైలు ద్వారా రాయలసీమలోని తాడిపత్రి నుంచి ముంబైలోని పోర్టుకు అరటి పండ్ల రవాణా కోసం ప్రత్యేకంగా నడిపిన రైలు విజయవంతం అయిందని ఎంపీ విజయ సాయి రెడ్డి మెచ్చుకున్నారు. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన రాయలసీమ ప్రాంతం నుంచి ముంబైకు ఈ తరహా ప్రత్యేక రైళ్ళను మరిన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ విజయ సాయి రెడ్డి రైల్వే మంత్రిని కోరారు.

 

 

అయితే.. విశాఖ-బెంగుళూరు మధ్య డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసును ప్రారంభించాలని కోరడం త్వరలో విశాఖ రాజధాని కాబోతోందన్న కోణంలోనే అడిగి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధాని హంగులు విశాఖకు సమకూర్చేలా ఆయన కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ అదే కోణంలో అడిగి ఉంటారని భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: