స్థానిక సంస్థల ఎన్నికలవేళ టీడీపీకి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఆ పార్టీలో బిగ్ వికెట్లు అన్ని టపా టపా పడుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు కీలక నేతలు వరుస పెట్టి సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన అనంతపురం జిల్లాలో ఇద్దరు కీలక నేతలు సైకిల్ దిగేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల నేడు వైఎస్సార్సీపీలో చేరనున్నారు. సీఎం జగన్ వీరికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
శమంతకమణి, ఆమె కుమార్తె యామినీ బాల టీడీపీ పాలనలో ఒకరు ఎమ్మెల్యేగా .. మరొకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. శమంతకమణి కుమార్తె యామిని బాల 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జేసీ దివాకర్ రెడ్డితో ఆమెకు తీవ్ర విబేధాలు వచ్చాయి. చివరకు ఎన్నికలకు ముందు తల్లి, కూతుళ్లకు పడలేదు. చివరకు గత యేడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు వీరిని పక్కన పెట్టేసి బండారు శ్రావణికి సీటు ఇచ్చారు. ఆమె వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓడిపోయారు.
ఇక ఇప్పుడు నియోజకవర్గ ఇన్చార్జ్గా బండారు శ్రావణి కొనసాగుతున్నారు. పార్టీలో ఈ తల్లి కూతుళ్లకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో వీరు ఇప్పుడు టీడీపీలో ఉంటే ఫ్యూచర్ లేదని డిసైడ్ అయ్యి పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇక శమంతకమణి ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాలకు హాజరుకాలేదు. దీంతో టీడీపీలో ఆసక్తికర చర్చ జరిగింది. అనారోగ్య కారణాలతోనే ఆమె ఈ సమావేశాలకు రాలేదని అనుకున్నా అసలు విషయం కాస్త లేట్గా బయట పడింది. ఇక టీడీపీలో ఉంటే తన కుటుంబానికి.. తన వారసుడికి రాజకీయ భవిష్యత్తు లేదని డిసైడ్ అయ్యే.. వీరు వైసీపీ నేతలకు టచ్లోకి వెళ్లారు. దీంతో వీరు వైసీపీ చేరికకు మార్గం సుగమం అయ్యింది.