రాష్ట్రంలో అధికార పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన లతీఫ్ పై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. హత్యకు ఒక అమ్మాయి వ్యవహారం కారణమని తెలుస్తోంది. జిల్లాలోని కొత్తపేట మండలం కేతేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్న కొడుకు, యువకులకు మధ్య జరిగిన వ్యవహారంలో లతీఫ్ తల దూర్చటంతో గొడవ పెద్దదైంది. 
 
టీఆర్ఎస్ మండల కమిటీ కార్యవర్గ సభ్యుడైన లతీఫ్ పార్టీ వ్యవహారాలతో పాటు కిరణాషాపును నిర్వహించేవాడు. లతీఫ్ సోదరుడు జహంగీర్ కుమారుడు తనకు పరిచయం ఉన్న అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వాట్సాప్ స్టేటస్ లో ఆ అమ్మాయి ఫోటో పెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. కొందరు ఎస్సీ కాలనీకి చెందిన యువకులు వాట్సాప్ స్టేటస్ ను చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వారు జహంగీర్ కొడుకుపై దాడి చేశారు. 
 
తన కిరాణాషాపు ముందు సోదరుడి కుమారుడిని యువకులు కొడుతూ ఉండటంతో లతీఫ్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దాడి చేయడం మంచి పద్దతి కాదని... ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందామని నచ్చజెప్పటానికి ప్రయత్నించాడు. లతీఫ్ మాటలు పట్టించుకోకుండా యువకులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తితో పొడవటంతో సంఘటనా స్థలంలోనే లతీఫ్ మృతి చెందాడు. 
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అందాల్సి ఉంది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య చేసిన యువకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు జహంగీర్ కొడుకును అదుపులోకి తీసుకొని ఘటనకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.                     

మరింత సమాచారం తెలుసుకోండి: