ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జగన్ సర్కార్ షాక్ ఇస్తూ ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కారణం చూపింది. అయితే దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్ సర్కార్ ఎన్నికల సంఘం పై విమర్శలు చేయడంతో పాటు న్యాయ పోరాటానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పిటిషన్ పై నేడు విచారణ జరిపింది సుప్రీంకోర్టు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బొబ్డే ధర్మాసనం విచారణ చేపట్టింది.
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయలేము అంటూ స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘనిదె తుది నిర్ణయం అంటూ జగన్ సర్కార్ కి షాక్ ఇచ్చినది సుప్రీమ్ కోర్ట్. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది ఎన్నికల కమిషన్ ఇష్టం అంటూ సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు గానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఇక జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అనుకున్నప్పటికీ.. భారీ షాక్ తగిలింది.
ఇదే సమయంలో ఎన్నికల సంఘం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఎన్నికల కోడ్ ఎత్తి వేయాలి అంటూ ఆదేశించినది సుప్రీంకోర్టు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకురావద్దని మాత్రం జగన్ సర్కార్ కు సూచించింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం ఉన్న పథకాలను మాత్రం కంటిన్యూ చేసుకోవచ్చు అంటూ తెలిపింది. ఇక ఎన్నికల నిర్వహణ తేదీ గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలి అంటూ ఎన్నికల సంఘానికి సూచించింది సుప్రీంకోర్టు. ఎన్నికలు వాయిదా నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి ఆగకూడదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అయితే సుప్రీం తీర్పు జగన్ సర్కార్ కు మరింత కలిసొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఇళ్ల పట్టాలు పంపిణీ కి ముందడుగు వేయడం సహా ఇతర కార్యకలాపాల వల్ల ఓటర్లను మరింత ఆకర్షించే అవకాశం ఉంది జగన్ సర్కార్కు.