ప్రపంచాన్ని వణికించేస్తోన్న కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను సైతం తెగ టెన్షన్ పెట్టేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ వైరస్కు బ్రేక్ వేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తెలంగాణ లో మాత్రం కరోనా వైరస్కు బ్రేకులు పడడం లేదు. ఇక ఇప్పటికే చైనా లోని వుహాన్ నగరం నుంచి ప్రారంభమైన కరోనా వైరస్ క్రమక్రమంగా ఒక్కో దేశానికి విస్తరిస్తూ ఇప్పుడు 163 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది.
ఒక్క ఇరాన్లోనే కరోనా సోకి ఇప్పటి వరకు 3 వేల మంది మృతి చెందారు. ఇరాన్ ప్రభుత్వం వైద్యం చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక ఓవరాల్గా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కరోనా సోకి 8 వేల మంది వరకు మృతి చెందారు. తెలంగాణలో క్రమక్రమంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయంతో కరోనా పాజిటివ్ కేసులు ఆరుకు చేరుకున్నాయి. నిన్నటి వరకు ఐదుకు చేరుకున్న ఈ కేసులు బుధవారంతో మరొకటి పెరగడంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆందోళన నెలకొంది.
యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు రిపోర్టుల్లో వెల్లడైంది. ఇక ప్రభుత్వం కరోనా సోకకుండా ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. అలాగే సినిమా హాళ్లు. మాల్స్ తో సహా అన్నింటిని మూసి వేయాలని సైతం ప్రకటించింది. ఇక ఇటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని నేరుగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి అనంతగిరిలో ఉన్న కరోనా ఐసోలేషన్ సెంటర్కు తరలించి.. అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు గాంధీ ఆసుపత్రిలో కూడా కరోనా అనుమానితుల కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు.