ఏపీలో దీనస్థితిలో కునారిల్లుతోన్న విపక్ష టీడీపీ పతనం.. పాతాళం అన్నీ ఆ పార్టీ నేతలకు కళ్ల ముందే కనపడుతుండడంతో ఏం చేయాలో తెలియక.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. తమ.. తమ వారసుల రాజకీయ భవిష్యత్తు ఏంట్రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ భవిష్యత్తు లేదు.. ఉండలేమని అనుకుంటున్న వాళ్లు అయితే తమ దారి తాము చూసుకుంటున్నారు. కొందరు బీజేపీ వైపు చూస్తుంటే. మరి కొందరు వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. ఇక ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే మనం అంత డేంజర్లో పడతామనుకుంటోన్న వారు లోలోన తెగ మదన పడిపోతున్నారు.
ఇక ఏపీలో అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు ఏం చేయాలో తెలియక. పార్టీలో ఉండాలా ? బయటకు వెళ్లాలా ? అని తలలు పట్టుకుంటోన్న పరిస్థితి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన త్రిమూర్తులుగా మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేరొందారు. వీరిలో జ్యోతుల నెహ్రూ గతంలో టీడీపీలో ఉండి ఆ తర్వాత పలు పార్టీలు మారి చివరకు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి తిరిగి టీడీపీలోకి వెళ్లారు.
ఇక ఇప్పుడు పార్టీ పుట్టి మునిగిపోతున్నా ఈ ముగ్గురూ ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులై చూస్తున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్–2గా పేరొంది, తెర వెనుక పార్టీని నడిపించిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం అయిన తునిలో సైతం ఓ వార్డు మెంబర్ను కూడా గెలిపించుకునే స్థితిలో లేరు. యనమల రాజకీయ జీవితం ముగిసినట్టే. ఇక చినరాజప్ప మాట ఎవ్వరూ వినే పరిస్థితి లేదు. ఇక తోట త్రిమూర్తులు తాను అనవసరంగా పార్టీ మారానే.. బాబు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారే.. ఇప్పుడు వైసీపీలో ఉండి ఉంటే మంత్రిని అయ్యేవాడిని అని వాపోతున్నారట.