ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కష్టాలు ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇదే సమయంలో విద్యార్థులకు పరీక్ష సమయం. ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి కాగా.. నేటి తో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయి. కాగా తెలంగాణ లో రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలు అవుతున్నాయి. రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమయి ఏప్రిల్ 6వ తేదీన ముగియనున్నాయి.ఈ నేపథ్యంలోనే మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులు కాపీ కొట్టకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని ఆమె అన్నారు.
పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమవుతాయని, విద్యార్థులు 8.30 గంటల వరకు పరీక్షకేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలి పోతుందని కొంత మంది కావాలని భయపెడుతున్నారని.. అలాంటి రూమర్లకు భయపడాల్సిన అవసరం లేదని.. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ప్రభుత్వం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారని అన్నారు. అంతే కాదు ప్రస్తుతం ఎండ తీవ్రత పెరిగిపోతుందని ఇందుకు గాను ప్రతి పరీక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యసిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు అందించడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుతామని తెలిపారు.
పరీక్షల సమయంలో ఎవైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించడానికి కంట్రోల్రూం (040-23230942)ను డీఈఓ కార్యాలయంలో ఏర్పాటుచేసామని తెలిపారు. ఇప్పటి వరకు హాల్ టికెట్లు అందని విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుగుకోవడానికి పరీక్ష కేంద్రంలో లిక్విడ్, శానిటైజర్లు, సబ్బులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ సత్యనారాయణరెడ్డి, అదనపు డైరెక్టర్ రమణకుమార్, శ్రీహరి పాల్గొన్నారు.