కరోనా లేదా కోవిడ్-19.. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్లో విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భూతం వల్ల మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అగ్రరాజ్యం, చిన్న దేశం అనే తేడా లేకుండా ప్రజలను గజగజలాడిస్తోంది. దీంతో దేశంలో ప్రతిచోటా కరోనా మహమ్మారి గురించి చర్చించుకునే పరిస్థితి వచ్చింది. మరోవైపు భారత్లోనూ ఈ వైరస్ ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం సమయానికి దేశవ్యాప్తంగా 168 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఇప్పటి వరకు 13,316 శాంపిల్స్ను పరీక్షించినట్లు వైద్యులు తెలిపారు. అలాగే తాజాగా చండీగఢ్ లో కొత్తగా కరోనా కేసు నిర్ధారణ అయింది. గత ఆదివారం లండన్ నుంచి ఇండియాకు వచ్చిన 23 ఏళ్ల యువతికి కరోనా ఉన్నట్టు గుర్తించారు. మరియు ఆమెతో కాంటాక్ట్ అయిన వారిని ట్రేస్ చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే కర్ణాటక, మహారాష్ట్రలో రెండేసి చొప్పున కొత్త కేసులు వెలుగుచూశాయి.
మరియు దేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ మొత్తం 13 కేసులు మరియు ఆంధ్రప్రదేశ్లో రెండు కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇప్పటివరకు ముగ్గురు మరణించగా.. మరో 15 మంది వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జి అయినట్టు తెలిపింది. మిగతా 151 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించింది. కాగా, దేశంలో రోజురోజూకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీనిపై ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి.