ఎక్కడో చైనాలోని పుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తోంది. అటు ఎటూ తిరుగుతూ చివరకు మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చేసింది. గంట గంటకు కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక కరోనా వైరస్ దెబ్బతో ఎక్కడికక్కడ ప్రపంచం ముందుకు కదల్లేక పోతోంది. కరోనా ఎఫెక్ట్ భారత దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలపై సైతం పడింది. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు దేవాలయాలను సైతం మూసేశారు. ఈ క్రమంలోనే ఏపీలోని అన్ని ప్రముఖ దేవాలయాలను మూసేశారు.
ఇక భద్రాచలం రాములోరి కళ్యాణాన్ని సైతం టీవీలో లైవ్ ద్వారా మాత్రమే చూడాలని.. ఎవ్వరూ కూడా భద్రాచలం కళ్యాణం చూసేందుకు రావొద్దని సూచించారు. ఆన్లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి సైతం ఆ అమౌంట్ రిటర్న్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక తిరుమల తిరుపతి. శ్రీశైలంలో సైతం అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలు రద్దు చేశారు. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారి ఆలయాన్ని కొద్ది రోజుల పాటు మూసి వేస్తున్నట్టు ప్రకటించారు.
కొన్ని శతాబ్దాల కాలంలో తిరుమల తిరుపతి ఆలయాన్ని మూసివేయడం ఇది రెండోసారి మాత్రమే. అప్పుడెప్పుడో శ్రీకృష్ణ దేవరాయుల పాలనా కాలంలో సాలువ నరసింహరాయుల కాలంలో తిరుమల ఆలయం మూసివేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇది జరిగి 500 సంవత్సరాలు అయ్యింది. అంటే ఇప్పుడు 5 శతాబ్దాల తర్వాత మళ్లీ తిరుమల తిరుపతి ఆలయాన్ని మూసివేశారు. ఇక ఏపీతో పాటు అటు తెలంగాణలోనూ చిన్న దేవాలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్లకుంటే మంచిదని సూచించారు.
పెద్ద సంఖ్యలో గుమిగూడే జాతరలు మానుకుంటే మంచిదని, శుభకార్యాలు వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలని ఇరు రాష్ట్రాల సీఎంలు కోరారు. ఈ కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ కానుంది. తెలంగాణలో పెళ్లిళ్లను 31 వరకు పరిమిత బంధువులతో చేసుకోవాలని.. ఆ తర్వాత పెళ్లిళ్లు కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు.