ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ని నయం చేసే మెడిసిన్ ఇంతవరకు అందుబాటులోకి రాని విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా వైరస్ నివారణ కోసం మెడిసిన్ తయారుచేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్కు ఓ మెడిసిన్ ద్వారా చెక్ పెట్టవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ భయంకర కోవిడ్-19కు మలేరియా చికిత్సలో వాడే ‘క్లోరోక్విన్’ ద్వారా నయం చేయవచ్చని చెప్పారు.
ఇప్పటికే దీనికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డిఏ) ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అయితే ఈ విషయంలో ఎఫ్డిఏ వారి కృషి చాలా ఉందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇంకా మరిన్ని యాంటీవైరల్ ఔషధాలకు ఎఫ్డిఏ ఆధ్వర్యంలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు తక్షణమే క్లోరోక్విన్ను వినియోగించడానికి సిద్ధమయ్యామని, కోవిడ్ రోగుల ఉపశమనం కోసం వీలైనంత త్వరగా మెడిసిన్ ఉపయోగించడం ప్రారంభిస్తామని అన్నారు.
అలాగే కోవిడ్-19కు చెక్ పెట్టడానికి మరిన్ని ఔషదాలను వినియోగంలోకి తీసుకురావడానికి ఎఫ్డిఏ అనుమతి తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, మలేరియా చికిత్సకు ఉపయోగించే క్లోరోక్విన్ను కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్లో పాల్గొంటున్న స్వచ్ఛంద కార్యకర్తలపై కూడా ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. అంటే ఈ ట్రయల్లో మలేరియాకు ఉపయోగించే క్లోరోక్విన్, కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందా? లేదా? అనే విషయాన్ని చెక్ చేయనున్నారు.
అయితే ఈ చికిత్సలో దుష్ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా టెస్ట్ చేసి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, చైనా దేశం వాళ్ళు కూడా కరోనా చికిత్సలో క్లోరోక్విన్ వాడుతున్నట్లు చెప్పారు. కొంతమందికి ఈ మెడిసిన్ వాడామని, సమర్ధవంతంగా పని చేసిందని వాళ్ళు ఇదివరకే ప్రకటించారు. ఇటు దక్షిణ కొరియా, బెల్జియం దేశాలు కూడా ఇదే ఔషధాన్ని వాడుతున్నట్లు పేర్కొంది. కాకపోతే యాంటీబయాటిక్ అజిత్రొమైసిన్తో కలిపి క్లోరోక్విన్ను తీసుకుంటే, రోగి శరీరంలో వైరస్ తీవ్రత తగ్గినట్లు తెలుస్తోంది.