కరోనా వ్యాప్తిని అరికట్టే విషయంలో ఏపీ కాస్త ఆలస్యంగానైనా మంచి నిర్ణయాలే తీసుకుంటోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ఇచ్చింది. ప్రముఖ ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో రద్దీని నియంత్రిస్తోంది.
దశల వారీగా ఆలయాలను మూత వేతకు సిద్ధమవుతోంది. సినిమా హాళ్లు, మాల్స్, జిమ్స్, క్లబ్స్ మూసి వేయాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా...ప్రజల సహకారం కూడా అవసరం. ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ ఇస్తున్న సూచనలు ప్రజలు పాటిస్తే కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ సూచిస్తోంది. ప్రభుత్వ చర్యలకు అందరూ సహకరిస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడవచ్చు.
విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఒక నోడల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాకు 30 మంది చొప్పున ఈ సెంటర్లో పని చేస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారికి జిల్లాలో ఉన్న నోడల్ సెంటర్లకు పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉంటే ప్రత్యేక ఐసోలేషన్లో పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం పైగా ఇంటింటా సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటికి ఒక ఆశా వర్కర్, ఏఎన్ఎంను పంపించి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించారు.
అయితే.. వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలకు, ప్రతిపక్షాలకు, మీడియాపై కూడా ఉంది. అందరం జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ చర్యలకు సహకరించకపోతే నిర్బంధించే చర్యలు తీసుకుంటామంటున్నారు. పెళ్లిళ్లు వీలైనంతగా వాయిదా వేసుకోవాలని, తప్పనిసరి అయితే తక్కువ మందితో నిర్వహించుకోవాలి సూచిస్తున్నారు.