కరోనా ప్రభావంతో ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే ఎంపిటిసి, జెడ్పిటిసి, మున్సిపాలిటీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరిగితే, అప్పుడు ఆ నామినేషన్ల ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. కానీ చాలాచోట్ల టీడీపీ అభ్యర్ధులు నామినేషన్స్ వేయలేకపోయారు. అయితే మళ్ళీ ఎన్నికలు రీ షెడ్యూల్ చేస్తే తప్ప, టీడీపీకి నామినేషన్స్ వేయడానికి కుదరదు. కాకపోతే అన్నిచోట్ల ఎన్నికలు రీ షెడ్యూల్ చేయడానికి కుదరకపోయిన, కొన్ని చోట్ల ఎన్నికల సంఘం మళ్ళీ రీ షెడ్యూల్ చేసే అవకాశముంది.
ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఎన్నికలు జరిగే ముందు తెలుస్తోంది. అయితే ఈలోపు మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు తమ అభ్యర్ధులు నామినేషన్స్ వేయని స్థానాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం డోన్పై బాబు ఫోకస్ చేశారు. మొన్న నామినేషన్ సమయంలో డోన్ మున్సిపాలిటీలో తమ అభ్యర్ధులు పోటీ చేయరని, టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి తేల్చిచెప్పారు.
కేఈ ప్రకటన చేసిన బాబు మాత్రం డోన్ మున్సిపాలిటీని వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. ఇప్పటికే డోన్ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. అసలు డోన్లో టీడీపీ తరుపున ఎన్ని నామినేషన్లు పడ్డాయో కనుకున్నారు. మొత్తం 33 వార్డుల్లో టీడీపీ వాళ్ళు 10 వార్డుల్లో నామినేషన్స్ వేసినట్లు తెలిసింది. అలాగే పొత్తులో పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్ధులు 7 వార్డుల్లో నామినేషన్స్ వేశారట.
అలాగే స్వంతత్ర అభ్యర్ధులు ఎంతమంది నామినేషన్స్ వేశారో కనుక్కుని, వారికి మద్ధతు ఇవ్వాలని బాబు చూస్తున్నారు. అయితే బాబు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసిన డోన్ మున్సిపాలిటీని గెలుచుకోవడం కష్టం. బుగ్గన కంచుకోటగా ఉన్న డోన్ వైసీపీ ఖాతాలో పడటం ఖాయం. మొత్తానికైతే బాబు డోన్లో సాధించేది ఏమి లేదు.