మొన్నటి వరకు చైనాను గడ గడలాడించిన కరోనా(కోవిడ్19) ఇప్పుడు ప్రపంచ దేశాల్లో విస్తరించింది. ఈ కరోనా మహమ్మారి వల్ల జనాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పటికే పదకొండు వేల మరణాలు సంవించాయి. రెండు లక్షలకు కరోనా బాధితులు చేరుకున్నట్లు సమాచారం. ఇలా రోజు రోజుకీ కరోనా మరణ మృదంగం వాయిస్తున్నట్లుంది. ఈ కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు భారత దేశంలో కూడా పడింది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. ప్రజలు సాధ్యమైనంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని వైద్యలు చెబుతున్నారు. మరోవైపు సెలబ్రెటీలు కరోనా దరికి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయంపై వీడియోలో, సోషల్ మాద్యమాల్లో పోస్టింగ్ లు పెడుతున్నారు.
సాధారణంగా తిరుపతి లడ్డూ అంటే ఎవరికైనా భక్తితో పాటు ఓ అద్బుతమైన రుచిని ఆస్వాదిస్తుంటారు. ప్రపంచంలోనే తిరుపతి లడ్డూకి ఓ ప్రత్యేకత ఉంది. తిరుపతికి వెళ్లిన వారు లడ్డూ తీసుకు వస్తే పలహారంగా పంచుతుంటారు. అంత గొప్ప తిరుపతి లడ్డూ కి కూడా కరోనా ఎఫెక్ట్ పడిందని అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు శ్రీవారి లడ్డూలను కూడా తాకింది. టీటీడీ చరిత్రలో మొట్టమొదటి సారిగా భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం నిరవధికంగా నిలిచిపోయింది. నిత్యం గోవింద నామస్మరణ చేస్తూ ఉంటే తిరుపతి ఆలయ ప్రాంగణాలు నిశ్శబ్దంతో ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా వారం రోజుల పాటు భక్తులను ఆలయంలోకి అనుమతించబోమని టీటీడీ తెలిపింది.
శ్రీవారి పూజా కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది ఆలయకమిటీ. కరోనా ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందో తెలియదు కానీ.. తిరుమలలో ఈ నెల 31 వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఇప్పటికే తయారు చేసిన శ్రీవారి లడ్డూలు 2 లక్షలకు పైగా నిల్వ ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు తిరుపతికి పదిరోజుల పాటు భక్తులు రావడం కష్టమే.. దీంతో, ఆ మిగిలిపోయిన 2 లక్షలకు పైగా శ్రీవారి లడ్డూలను తమ ఉద్యోగులకు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఉగాది కానుకగా 10 లడ్డూల చొప్పున ఉద్యోగులకు పంపిణీ చేయనున్నారు అధికారులు.