ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ కరోనాను ఉద్దేశించి, కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపును పాటించి, జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని, కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ను అంతం చేద్దామని.. పిలుపునిచ్చారు. ఈ ఆదివారం ప్రజలంతా స్వచ్ఛందంగా దీన్ని సంపూర్ణం చేయాలి అని చెప్పారు. 

 

బయటకు రాకుండా మీరంతా ఇంట్లోనే ఉండి ఈ కార్యక్రమానికి మద్దతు తెలపండి.. మీ రక్షణ కోసం మేము  బయట ఉంటాం.. అని ఆయన ప్రజలను కోరారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా.. ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి పోలీసు సిబ్బంది పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలని, పోలీసులు ఇళ్లల్లో ఉండవద్దని  అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమవుతారు కాబట్టి పోలీసులు అప్రమత్తతో ఉండాలని వారికి సూచించారు.

 

కంట్రోల్ రూంల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని, బయట ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూస్తామని  డీజీపీ ఈ సందర్భంగా తెలిపారు. డయల్‌ 100 ద్వారా నిరంతరంగా సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు డీజీపీ సవాంగ్ పిలుపునిచ్చారు. కాగా, కోవిడ్- 19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ సూచించిన ప్రకారం, ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’కు అందరం సంఘీభావం ప్రకటిద్దామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి అందరికి విదితమే.

 

కాగా, ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే.. దాదాపు 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎందుకంటే, నిపుణులు తెలిపిన ప్రకారం కరోనా వైరస్ ఒక ప్రదేశంలో సుమారు 12 గంటల వరకు జీవించి ఉంటుంది. జనతా కర్ఫ్యూ 14 గంటల పాటు పాటించడం ద్వారా కరోనా వైరస్ జీవించి ఉన్న ప్రదేశాలలో ఎవరు వుండరు కాబట్టి, తద్వారా వైరస్  గొలుసును ఛేదించడం ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా నిరోధించడమే దీని వెనుక వున్న ముఖ్య ఉద్దేశం.

మరింత సమాచారం తెలుసుకోండి: