ప్రస్తుతం ప్రపంచమంతా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. సాధారణంగా ఎప్పుడైనా, ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఏవో కొన్ని దేశాలకు లేదా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ, ప్రస్తుతం వచ్చిన ఈ సంక్షోభం ప్రపంచ ప్రజలందరినీ విపత్తులోకి ముంచివేసింది. తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ ఇన్ని దేశాలలో ప్రభావం కనిపించలేదు. ఈ రోజు కరోనా దుష్ప్రభావం అనేక దేశాలలో కనిపిస్తోంది. గత రెండు నెలలుగా నిరంతరం ప్రపంచమంతా కరోనా వైరస్ కు సంబంధించి విషాదకర వార్తలు వస్తున్నాయి. మనం వింటూ ఉన్నాం. గత రెండు నెలలుగా భారతదేశం లోని 130 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా విజృంభించిన కరోనా వైరస్ ను ప్రతిఘటిస్తున్నారు.
అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఈ ప్రమాదం నుంచి మనం బయటపడ్డామని అనిపిస్తోంది. అంతా బాగుంది అనిపిస్తోంది. అయితే.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న మహమ్మారి కరోనా గురించి నిశ్చింతగా ఉండడమనేది అంత సులువైన అంశం కాదు. అందువల్ల ప్రతి ఒక్క భారతీయుడు జాగ్రత్తలు పాటించి, అప్రమత్తులై ఉండాలి. ఇది చాలా అవసరం. దీనికి సంబంధించి భారతదేశ ప్రధాని దేశ ప్రజల రక్షణ కొరకు ఈ ఆదివారం జనతా కర్ఫ్యూ ని పెట్టారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి దేశ ప్రజలంతా మద్దతు గా నిలబడుతున్నారు. అన్ని రంగాలకు చెందిన సెలబ్రెటీలందరూ కూడా ఈ జనతా కర్ఫ్యూకి జైకొడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే రోజా సైతం జనతా కర్ఫ్యూని తూచా పాటించాలని ఆవిడ సూచిస్తున్నారు. మన రాష్ట్రం, దేశం నుంచి కరోనా వైరస్ను తరిమి కొట్టేందుకు అందరూ సహకరించాలని తాను ఓ వీడియో ద్వారా అందరికి సందేశాన్ని అందించారు. ఇక విదేశీయులను ముందుగా అదుపులోకి తీసుకుని 14 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లలో ఉంచాకే వాళ్ళను బయటకు తీసుకురావాలని ఈ విధమైన చర్యలు తీసుకుంటే తప్పించి మనం ఈ మహమ్మరిని తరమలేమంటున్నారు.
ఇక మరికొంత మంది విదేశీయులు మాత్రం ఇవేమి పట్టనట్టు ఇష్టమొచ్చినట్టు బయట తిరుగుతుతున్నారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైరస్ వ్యాప్తికి ఎటువంటి బాధ్యత లేకుండా చివరకు వాళ్ళే కారణమవుతున్నారని అన్నారు. ఆ విధంగా నిర్లక్ష్యరాహిత్యంగా ఉన్నవారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆమె కోరారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని.. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమన్నారు.
ఈ వైరస్ కారణంగా రేపు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 వరకు ప్రజలంతా ఇంటిపట్టునే ఉండాలని కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులకు చప్పట్లతో కృతజ్ఞతా భావన కలిగి ఉండాలని అన్నారు మోదీ. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆర్టీసీ, రైళ్లు, మెట్రో సర్వీసుల కూడా నిలిపి వేస్తున్నారని తెలిపారు.