కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు రోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మరియు కరోనా మరణాలు పెరిగిపోవడంతో ప్రజల్లో ఎంతో ఆందోళన కలిగిస్తోంది. చైనాలో మొదలై, యూరప్ ని అల్లకల్లోలం చేస్తూ, అగ్రరాజ్యాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది కరోనా. ఇప్పటికే 11వేల మందికిపైగా కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ఇక ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్లోనూ విజృంభిస్తూ తాజాగా ఇరవై రాష్ట్రాలకు విస్తరించింది. దీనిని కట్టడిచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది నీకు, నాకు మాత్రమే కాదు. భావి తరాలకు, ఈ దేశానికి, భవిష్యత్ తరాలకు కూడా ఎంతో ముఖ్యం అని సూచించారు. కరోనా వైరస్ సాధారణ వాతావరణంలో 10 నుంచి 12 గంటలు మాత్రమే బతకగలుగుతుంది. జనతా కర్ఫ్యూ 14 గంటల పాటు బ్రతుకుతుంది. అంటే.. 14 గంటల పాటు.. ఏ ఒక్కరు, మరొకరిని కలిసే అవకాశం ఉండదు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెయిన్ లింక్ను అలా తెగ్గొట్టేందుకు అవకాశం దొరుకుతుంది.
అయితే జనతా కర్ఫ్యూ వల్ల ఇంట్లో ఉన్నాం కదా అని మన టైంను ఫోన్కే పరిమితం చేసేయొద్దు. నిజానికి జనతా కర్ఫ్యూ అంటే.. అందరూ ఇళ్లలోనే ఉంటాం. సో.,. మనతో పాటు మన స్నేహితులు కూడా వారి వారి కుటుంబాలతో గడిపే సమయం ఇది అని గుర్తించి.. మనం చాటింగులు తగ్గించేసుకుందాం. అవసరమైతే.. ఫోన్లు ఈ రోజంతా(అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి) స్విచ్ఛాఫ్ చేసేసుకుందాం. సమయం మొత్తాన్ని పిల్లలకు శ్రీమతికి, తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చేద్దాం. ఇంట్లోనే హ్యాపీగా గడిపేద్దాం.