కరోనా వైరస్కు బ్రేకులు వేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రజలు అందరు ఇళ్లలోనూ ఉంటూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉంటూ స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం తెలంగాణలో రోజు రోజుకు కరోనా కోరలు చాస్తుండడంతో గత ఇరవై రోజులుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కేసీఆర్ ఎప్పటికప్పుడు కరోనా పై తెలంగాణ మంత్రులు ... ప్రజా ప్రతినిధులను అలెర్ట్ చేస్తుండడంతో పాటు ప్రెస్ మీట్లు పెడూత ప్రజలకు పలు సూచనలు చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఆదివారం మోదీ జనతా కర్ఫ్యూ కు సైతం ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ఇళ్లల్లో ఉండి మద్దతు ప్రకటించడంతో పాటు సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని పిలుపు ఇచ్చారు.
ఆదివారం ఉదయం నుంచే తెలంగాణలో కర్ఫ్యూ ప్రారంభమైంది. హైదరాబాద్ మహానగరంలో కర్ఫ్యూతో రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఖాళీగా కనపడుతున్నాయి. హైదరాబాద్లో ఎల్లప్పుడు రద్దీగా కనపడే బస్టాండులన్నీ ఈ రోజు బోసిపోయాయి. ఎక్కడ చూసినా సందడి లేదు. అసలు రణగొణ ధ్వనులే లేవు. దీంతో సందట్లో సడేమియా అన్నట్టు కొందరు యువకులు ఖాళీగా ఉన్న బస్టాండులలో క్రికెట్ ఆడుకుంటున్నారు.
ఎంజీబీఎస్ బస్టాండులోకి స్థానిక యువకులు వచ్చి కాసేపు క్రికెట్ ఆడారు. అయితే, అక్కడికి మీడియా రావడాన్ని గమనించిన పోలీసులు ఆ యువకులను అక్కడ నుంచి పంపించి వేశారు. చాలా వరకు ప్రజలు కరోనా ప్రభావం అర్థం చేసుకుని స్వచ్ఛందంగా ఈ జనతా కర్ఫ్యూకు సపోర్ట్ చేస్తుంటే అక్కడక్కడా ఒకరిద్దరు మాత్రం కార్లు వేసుకుని బయటకు వస్తున్నారు. అదేంటని పోలీసులు ప్రశ్నిస్తే అత్యవసర పనులు అని సమాధానం ఇస్తున్నారు.