కరోనా బూచీ దెబ్బతో ప్రపంచం అంతా చిగురు టాకులా వణికి పోతోంది. ఈ వైరస్ సోకి ఇప్పటికే 12 వేల మంది చనిపోయారు. మరో 3 లక్షల మంది బాధితులు అధికారిక లెక్కల ప్రకారం ఈ వైరస్తో బాధపడుతున్నారు. ఇక మన దేశంలో ఈ వైరస్ సోకిన వారిలో ఇప్పటికే 300 మంది ఉన్నారు. గంట గంటకు ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్, ఒడిశా లాంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. జాతీయ మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉంటుందా ? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం చివరకు ఆదివారం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపు ఇచ్చారు. ఆదివారం ఉదయం నుంచే దేశ వ్యాప్తంగా ఈ కర్ఫ్యూ అమలు అవుతోంది. ఇక నిన్న మొన్నటి వరక కరోనా వైరస్ సోకితే కేవలం 65 ఏళ్ల పైడిన వృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలు మాత్రమే త్వరగా చనిపోతారని.. యువకులకు కరోనా వైరస్ సోకితే దీనిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెపుతూ వచ్చారు.
అందుకే కరోనా వైరస్ విషయంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని అందరూ చెప్పారు. అయితే కరోనా వైరస్కు వృద్ధులు, పిల్లలే కాదు యువకులు కూడా బలవుతారని తాజా పరిణామాలు చెపుతున్నాయి. ఇటీవల చైనాతో పాటు ఇరాన్ లాంటి చోట్ల యువకులు సైతం దీని భారీన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మనదేశంలో సైతం ఓ యువకుడు కరోనా కాటుకు బలయ్యాడు
.
మన దేశంలో ఇప్పటికే కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6కు చేరుకుంది. తాజాగా ఆదివారం కరోనా సోకి బిహార్ రాష్ట్రంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 38 ఏళ్ల యువకుడు సైతం కరోనాతో చనిపోవడంతో కరోనాకు ఎవ్వరూ వేరు కాదని... దీని భారీన పడితే ఎవరు అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే అని అర్థమవుతోంది.