కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అతలాకుతులం అవుతున్నారు. ఇప్పటికే వేల మందిని కరోనా బలితీసుకుంది. లక్షల్లో దీని బాధితులు ఉన్నారు. కరోనా ప్రజలపైనే కాకుండా అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. అయితే తాజాగా కరోనా ఎఫెక్ట్ ఓ ప్రేమ జంట పెళ్లిపై పడింది. దీంతో వారి పెళ్లి వాయిదా పడింది. ఇలా వాయిదాపడడం తొలిసారి అయ్యుంటే వీరు అంతగా బాధపడేవారు కారు. ఎందుకంటే ఇప్పటికే వీరి పెళ్లి రెండు సార్లు వాయిదా పడగా.. ఇప్పుడు కరోనా వల్ల మూడో సారి కూడా ఆగిపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రంలోని ఎరాన్హీపాలన్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ చంద్రన్(26), సాండాసంతోష్ (23)లు మంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారింది. జీవితాన్ని పంచుకోవాలని, జీవన మాధుర్యాన్ని ఆస్వాదించాలని కలలుగన్నారు. ఈ క్రమంలోనే పెద్దలతో చెప్పి పెళ్లి కూడా నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే తొలుత 2018 మే 20న వీరి పెళ్లికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. అప్పట్లో నిఫా వైరస్ రాష్ట్రాన్ని చుట్టుముట్టడంతో పెళ్లి చేసుకోవడం సరికాదని వాయిదా వేసుకున్నారు.
ఇక ఏడాది తర్వాత కేరళీయుల సంవత్సరాది అయిన ఓనం పండుగ రోజున పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. సరిగ్గా పెళ్లి రోజు దగ్గరయ్యేసరికి రాష్ట్రాన్ని ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయి. దీంతో కేరళ మొత్తం అతలాకుతలం కావడం.. వీరి పెళ్లి ఆగిపోవడం జరిగింది. మళ్లీ ఈనెల 20న పెళ్లి చేసుకోవాలని ముచ్చటగా మూడోసారి ముహూర్తం నిర్ణయించారు ఈ ప్రేమజంట. కానీ, మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుదామనుకున్న వారి ప్రయత్నానికి ముచ్చటగా మూడోసారి కూడా విఘ్నం ఎదురైంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతుండడంతో వీరి పెళ్లి మళ్లీ వాయిదా పడండి. ఇలా రెండేళ్ల కాలంలో మూడుసార్లు ముహూర్తం నిర్ణయించినా పెళ్లితంతు పూర్తికాకపోవడంతో ఆ ప్రేమ జంటను నిరాశ ఆవహిస్తోంది. ఇక అన్నీ కుదిరితే ఈ ప్రేమ జంట వచ్చే సెప్టెంబర్లో పెళ్లిపీటలు ఎక్కాలనుకుంటున్నారు. మరి ఈ సారైనా వీరి పెళ్లికి ఎలాంటి ఆటకం రాకుండా జరగాలని కోరుకుందాం.