కరోనా వైరస్ లేదా కోవిడ్-19 ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలను గడగడలాడిస్తుంది. కొన్నివారాల కిందటి వరకు కేవలం చైనాకే పరిమితం అనుకున్న కరోనా మహమ్మారి ఇప్పుడు అనేక దేశాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. చైనాలో వేలాదిమందిని కబళించిన కరోనా వైరస్ దక్షిణ కొరియా, ఇరాన్ లతో పాటు ఇటలీ వంటి యూరోపియన్ దేశాలను కూడా వణికిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. కరోనా మృతుల సంఖ్య 11,417కి చేరగా.. 276462 మందికి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు బాధిత దేశాలు యుద్ధం చేస్తుంటే..ఈ వైరస్ సోకని దేశాలు మాత్రం ఈ రాక్షస వైరస్ తమ దేశానికి సోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నారు.
మరోవైపు సామాజిక మాధ్యమాలు కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలను గజిబిజి, గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఉన్నవి, లేనివి చెప్పి ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నారు. మరియు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూస్తుంటే ప్రజలకు ఏది నమ్మాలో.. ఏడి నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఇందులో భాగంగా ప్రతి 15 నిమిషాలకు నీళ్లు తాగితే సరిపోతుందని, పసుపు తింటే తగ్గిపోతుందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదంటున్నారు శాస్త్రవేత్తలు.
ప్రతి 15 నిమిషాలకోసారి నీళ్లు తాగడం వల్ల గొంతు ద్వారా ఎలాంటి వైరస్ కూడా శరీరంలోని వెళ్లదని సోషల్ మీడియాలో ఓ పోస్టింగ్ విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు. కానీ, తరచూ నీళ్లు తాగడం మంచిదే. శ్వాస సంబంధిత వైరస్ల వ్యాప్తిని నిరోధిస్తుందనడంలో మాత్రం శాస్త్రీయత లేదు. అలాగే పసుపు తింటే తగ్గిపోతుంది అనే వార్త కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. పసుపులో రోగనిరోధక శక్తి ఉంటుందని మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. పసుపు కరోనా వైరస్ను నియంత్రిస్తుందనడానికి కూడా ఎలాంటి ఆధారాల్లేవు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి అసత్యాలు గుడ్డిగా నమ్మకండి.