కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఈ వైరస్ భయంతో ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజలు ఇంటిపట్టునే ఉండిపోవడంతో నగరాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక కొన్ని దేశాలలో ప్రజా కదలిక పై ప్రభుత్వాలు నిషేధం విధిస్తే మరి కొన్ని చోట్ల ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్ తీవ్రత భారత్లో రోజురోజుకు పెరుగుతోంది.
ఇదిలా ఉంటే.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందాం అన్న ఓ జంటకు మరియు వారి కుటుంబం సభ్యులకు నిన్న ఆదివారం ఊహించని షాక్ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన శరత్, క్రిష్ణగిరి సమీపంలోని మణియాండహళ్లి గ్రామానికి చెందిన రేవతితో ఆదివారం పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. క్రిష్ణగిరిలో కళ్యాణమంటపం, పురోహితులు, వంట మనుషులతో పాటు పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే లక్షల ఖర్చుతో పెళ్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వెయ్యి మందికి వంటలు వండి ఆఖరుకు ఎనిమిది మందితోనే పెళ్లి తంతు పూర్తి చేసుకున్నారు.
ఇక కరోనా వైరస్ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ విధించడం, వాహనాల రాకపోకలు స్తంభించడంతో అతిథులెవ్వరూ రాలేదు. ఆఖరికి అటు, ఇటు కుటుంబ సభ్యులే పెళ్లిని జరిపించారు. మరియు ఎంతో ఖర్చు చేసి వండిన వంటలు వృథాగా మిగిలిపోయాయి. కాగా, కరోనాని కట్టడి చేయడానికి ప్రధాని మోడీ నిన్న ఆదివారం జనతా కర్ఫ్యూ అంటూ యుద్ధం ప్రకటించారు. జనతా కర్ఫ్యూకి దేశమంతా సై అంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటానికి 14 గంటలపాటు ఇల్లు దాటబోమని దేశప్రజలు ఇంటిపట్టునే ఉన్నారు. ప్రధాని పిలుపు మేరకు దేశమంతా అన్నీ బంద్ అయ్యాయి. రైళ్లు, బస్సులు, విమానాలు, షాపులు, మాల్స్, దాదాపు అన్నీ ఆగిపోయాయి.