అధికార పార్టీ వైసిపి నేతలు అంటున్నారని కాదుకానీ నిజంగానే ఎల్లో వైరస్ బాగా పెరిగిపోతున్నట్లే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమి చేసినా తప్పే ఏమీ చేయకపోయినా తప్పే టిడిపి నేతల దృష్టిలో. కరోనా వైరస్ గురించే తీసుకుంటే పేదలకు సరుకులు కొనుక్కునేందుకు వెయ్యి రూపాయలు ఇవ్వబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. వెంటనే అది సోరపోదని కాబట్టి వెయ్యి రూపాయలను 1500 రూపాయలకు పెంచాలని టిడిపి ఎంఎల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ మొదలుపెట్టేశాడు. అదే జగన్ 1500 రూపాయలని ప్రకటించుంటే వెంటనే రూ. 2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసుండేవారే.

 

ఇక కరోనా వైరస్ సమస్యను జగన్ చాలా తక్కువగా చూపించాడని నారావారి పుత్రరత్నం లోకేష్ ఒకటే గోల పెట్టేస్తున్నాడు. అలాగే వైరస్ పెద్దగా లేదని స్వయంగా చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తప్పుడు లేఖ రాసినట్లు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేసిన రోజుకు ఏపి మొత్తం మీద నెల్లూరులో ఒక్క కేసే నమోదైంది వాస్తవం.  కాబట్టే కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని జగన్ చెప్పాడు.

 

పైగా అప్పటికే కరోనా సమస్యపై ప్రతిరోజు వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ళనాని,  చీఫ్ సెక్రటరీ, వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శితో రివ్యూ చేస్తునే ఉన్నాడు. వాళ్ళ ఫీడ్ బ్యాక్ ప్రకారమే రాష్ట్రలో వైరస్ తీవ్రత అంతగా లేదని చెప్పాడు. అదే సమయంలో చంద్రబాబునాయుడు మాత్రం ప్రతిరోజు మీడియా సమావేశాలు పెట్టి కరోనా వైరస్ పై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని తిట్టిపోస్తునే ఉన్నాడు. ఎలాగూ చంద్రబాబు తిడుతున్నాడు కాబట్టి టిడిపి నేతలంతా జగన్ ను తిడుతునే ఉన్నారు. చర్యలు తీసుకోకపోతే తీసుకోలేదంటారు. ఒకవేళ తీసుకుంటే తమకు భయపడే తీసుకుంటారని ఎగతాళి చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు గోరంత చేస్తే కొండంత ప్రచారం చేసుకుంటాడు. అదే జగన్ మాత్రం పనులు చేస్తూనే చేసిన దాన్ని కూడా ప్రచారం చేసుకోవటం లేదు. చంద్రబాబుకేమో అచ్చంగా ప్రచారమే కావాలి. జగనేమో ప్రచారం కన్నా పనులు జరగటం ముఖ్యమనుకునే వ్యక్తి.  ఇక్కడే జగన్-చంద్రబాబు మధ్య సమస్య వస్తోంది. అందుకనే జగన్ మనస్తత్వాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అండ్ కో రెచ్చిపోతున్నారు. అందుకనే వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలని సూచిస్తున్నాడు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: