కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న పనులేవీ చంద్రబాబుకు కనిపించకకపోవడం దారుణమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాల్సిందిపోయి ఇందులోనూ రాజకీయం చేయాలని చూడడం హేయనీయమని అన్నారు. ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. 'కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి. ఎల్లో మీడియా తుమ్ములు, దగ్గులతో పచ్చ వైరస్ను వదులుతూనే ఉంది. అధికార పీఠం నుంచి తరిమివేసినా చంద్రబాబు బ్యాచ్ తమ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోంది.
జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకూ సూచించడం గమనార్హం. కాగా మరో ట్వీట్లో.. అత్యంత బాధ్యతతో వ్యవహరించే జగన్ గారి పాలనలో ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సంతోషించాలి. అనుభవజ్ఞుడు అని చెప్పుకునే వ్యక్తిని తరిమేసి ఉండకపోతే ఇవాళ కరోనా నియంత్రణ కంటే తన ప్రచారం ఎక్కువగా ఉండేదంటూనే, జాగ్రత్తల పేరుతో వాణిజ్య ప్రకటనలు జారీ చేసి పచ్చమీడియాకు వేల కోట్లు దోచి పెట్టేవాడు' అంటూ ట్విట్టర్లో మండిపడ్డారు.రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో... ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. విశాఖ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో కేసులు నమోదవుతుండటంత ఆయా జిల్లాల అధికారులు ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు.
ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. ప్రతీ జిల్లాలో మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి దాని ద్వారా మండల స్థాయిల కమిటీల ద్వారా గ్రామాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక మరోవైపు గ్రామ వాలంటీర్లు, రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బందితో ఉన్న బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయి. పరిస్ధితిపై ఎప్పటికప్పుడు రాష్ట్ర స్ధాయి అధికారులకు సమాచారం ఇస్తున్నాయి. స్ధానికంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి డేటా సేకరిస్తున్నాయి. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.