భారత దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ రాష్ట్ర ప్రజలందరికీ భయాందోళనకు గురిచేస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏకంగా 30కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు కు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు..
అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు... ప్రజలను ఇంటికి మాత్రమే పరిమితం కావాలని సూచిస్తూ లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు మాత్రం ఎవరూ ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసినా లెక్కచేయకుండా లాక్ డౌన్ విధించిన ఈ సమయంలో కూడా యదేచ్ఛగా రోడ్లపైన తిరుగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నగరాల్లో విద్యావంతులు సైతం ఇలా వ్యవహరించడం గమనార్హం. అయితే ఓ వైపు పోలీసులు నగర వాసులకు సూచనలు సలహాలు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే... రాష్ట్రంలోని పల్లెటూరు మాత్రం స్వచ్ఛందంగా నిర్బంధాన్ని ప్రకటిస్తున్నాయి.
ఎలాంటి పోలీసులు బలగాలు లేకుండానే గ్రామస్తులు స్వచ్ఛందంగా... ఊరి చివర రోడ్ బ్లాక్ చేస్తూ... తమ ఊరికి ఎవరూ రావద్దు... మా ఊరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళద్దు అంటూ తీర్మానం చేస్తున్నారు. ఆదిలాబాద్లోని 70 గ్రామాల ప్రజలు ఇలా తీర్మానం చేశారు. తమతమ గ్రామాల్లోకి ఎలాంటి వాహనా రైలు రాకపోకలు జరపకుండా ముళ్లకంచెలు రోడ్లపై వేశారు. బండరాళ్లు అడ్డుగా పెట్టారు. ఇక అటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా ఇలాగే గ్రామాల ప్రజలు ప్రభుత్వం విధించిన నిబంధనను తు.చ తప్పకుండా పాటిస్తూ తమ తమ గ్రామాలలో స్వీయ నిర్భంధానికి ప్రకటిస్తున్నారు.