కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో చైనాలో మరో వైరస్ బయటపడింది. ఈ వైరస్తో ఓ వ్యక్తి మృత్యువాతపడడంతో మళ్లీ కలకలం రేగుతోంది. ఇప్పటికే కరోనా వైరస్తో చైనాతోపాటు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 16500మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఇందులో ఒక్కచైనాలోనే మృతుల సంఖ్య 3,270కు చేరగా, 81,093 మందికి వైరస్ సోకింది. అయితే.. కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాకు హంటావైరస్ రూపంలో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. చైనాలోని షాంగ్డాండ్ ప్రొవియన్స్లో హంటా వైరస్ను వైద్యాధికారులు గుర్తించారు. ఇక్కడ 39 ఏళ్ల వ్యక్తి హంటావైరస్ బారినపడి చనిపోయాడు. అయితే, 1959లోనే ఈ వైరస్ను మొదటిసారి గుర్తించారు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ 2016 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా హంటావైరస్తో ఒకరు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్త మవుతోంది.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ అనతికాలంలోనే ప్రపంచ దేశాలకు వ్యాపించి, కలకలరేపుతోంది. ఈ తరుణంలోనే హంటావైరస్తో ఒకరు మరణించడంతో ఆ దేశవాసులు భయంతో వణికిపోతున్నారు. అయితే. కరోనా వైరస్ కట్టడికి చైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఈ తరుణంలో కొవిడ్-19ను తొందరలోనే కట్టడి చేయగలిగింది. కొద్దిరోజులుగా స్థానికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా పాజిటివ్ నమోదు అవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల 74 కేసులు నమోదు అయినట్లు మంగళవారం జాతీయ హెల్త్ కమిషన్ పేర్కొన్నది. గత ఏడాది వుహాన్ నగరం కేంద్రంగా కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. వుహాన్లో సుమారు వారం రోజుల తర్వాత ఒక కొత్త కేసు నమోదు అయ్యింది. అయితే. వుహాన్లో ఇవాళ ఏడుగురు మరణించినట్లు కూడా చైనా ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఏదిఏమైనా.. కరోనా కట్టడితో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తేసే అవకాశం ఉంటుందనకుంటున్న తరుణంలో హంటావైరస్ రీ ఎంట్రీ ఇవ్వడంతో కలకలం రేగుతోంది.