కరోనా ఎఫెక్ట్తో సినిమా, పొలిటికల్, స్పోర్ట్స్ ఇలా ప్రతీ రంగానికి చెందిన సెలబ్రీటీలు ఇంటికే పరిమితమవుతున్నారు. దేశం మొత్తం షట్డౌన్ కావడంతో ఇంట్లోంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. నిత్యం బిజిబిజిగా ఉండే ప్రముఖులు తమకిష్టమైన అభిరుచులకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబసభ్యులతో భోజనం చేయడం, తీరిగ్గా కబుర్లు చెప్పుకోవడం, చిన్న పిల్లలు ఉంటే వారితో కలసి ఆడుకోవడం, వారి ఇష్టాలను తెలుసుకుని ముచ్చటపడటం ఇలా ఒక్కటేమిటి అయిన వాళ్లకి దగ్గరగా జీవిస్తూ వ్యక్తిగత జీవితాన్ని సంపూర్ణం చేసుకుంటున్నారు. కరోనాతోనైనా ఓ నాలుగు రోజులు కుటుంబంతో గడుపుతున్నారనే అనే భావన సెలబ్రీటీల బంధువుల్లో వ్యక్తమవుతోందంటే ఆశ్చర్యం లేదు.
ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి కూడా తన కుటుంబ సభ్యుల మధ్య ఉల్లాసంగా..ఉత్సాహంగా గడుపుతున్న ఫొటోలు బయటకి వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులకు స్వయంగా వంట చేసి పెట్టడం విశేషం. చికెన్ కర్రీని వండి అందరికీ వడ్డించినట్లు సమాచారం. రాజకీయాల్లోనే కాదు కుంకింగ్లోనూ రేవంత్ కింగే అని నెటిజన్లు ఆయన ఫొటోలకు కామెంట్లు పెడుతుండటం విశేషం. నిన్నా మొన్నటి వరకు..కరోనా కల్లోలం రాష్ట్రాన్ని తాకనంత వరకు రాష్ట్ర రాజకీయాలను కుతకుత ఉడికించిన రేవంతన్నలో ఇంత సిప్లిసిటీ దాగుందా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులంతా కూడా ఇళ్ల నుంచి బయటకి రావడం లేదు. ప్రభుత్వం సూచించిన విధంగా నియోజకవర్గంలో కూడా ఎక్కడా పర్యటించకుండా ఫోన్లలోనే కరోనా జాగ్రత్తలు, అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక బయట తిరిగి కాస్త జలుబు చేసినా..ఎమ్మెల్యే కోనప్పలా క్వారంటైన్కు తరలాల్సి వస్తుందేమోనని బయటకి రావడానికి సాహసించడం లేదు. అందుకే ఎందుకొచ్చిన గొడవ ఇంట్లోనే హాయిగా కుటుంబ సభ్యుల మధ్యే కాలక్షేపం చేస్తే ఏం చికాకు ఉండదు అనుకుంటున్నారు.ఇక దొరక్కదొరక్క ఈ అవకాశాన్ని ఎంచక్కా సద్వినియోగం చేసుకుంటున్నారు.