ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో చైనా, అమెరికాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనాలోని వుహాన్ నగరం కేంద్రం కరోనా వైరస్ గత ఏడాది డిసెంబర్ 31న బయటపడిన విషయం తెలిసిందే. అయితే.. మొదట్లో దానిని ఎవరూ పెద్దగా ఖాతరు చేయలేదు.. చూస్తుండగానే.. ఈ వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. దాదాపు 50కిపైగా దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. జనజీవనం మొత్తం స్తంభించి పోయింది. ఈ కరోనా వైరస్ ప్రభావం చైనా తర్వాత ఇటలీలోతీవ్రంగా ఉంది. ఇక అగ్రరాజ్యమైన అమెరికాలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే వేలమంది దీని బారిన పడ్డారు. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా అప్రమత్తం చేయకపోవడం వల్లే.. ఈ రోజు ప్రపంచం ప్రమాదటపుటంచుల్లో ఉందని అన్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ను చైనా వైరస్ అని కూడా ఆయన అన్నారు.
తాజాగా, అమెరికాకు చెందిన లాయర్ ఏకంగా చైనాపై కోర్టుకు ఎక్కాడు. అమెరికా పౌరులను చంపేందుకే కోవిడ్-19 వైరస్ను చైనా సృష్టించి వ్యాపింపజేసిందంటూ అమెరికా న్యాయవాది ఒకరు స్థానిక కోర్టులో కేసు వేయడం గమనార్హం. ఇంతటి ప్రమాదకర వైరస్ను సృష్టించినందుకు అమెరికాకు చైనా 20 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని టెక్సాస్ డిస్ర్టిక్ కోర్టులో లారీ క్లేమన్ అనే న్యయవాది కేసు వేశాడు. జీవాయుధాల తయారీలో భాగంగానే కోవిడ్-19ను చైనా సృష్టించిందని ఆయన ఆరోపించాడు. అయితే.. ఈ వైరస్ను కావాలనే ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేసినా చేయకపోయినా ఈ విషయంలో చైనా అమెరికా చట్టాలు సహా ప్రపంచంలోని అన్ని చట్టాలను ఉల్లంఘించిందని ఆయన విమర్శించాడు. తన శతృదేశ పౌరులను చంపేందుకే చైనా ఈ వైరస్ను ప్రయోగశాలలో నిల్వ చేసిందని కోర్టుకు వివరించాడు. అయితే.. చైనీస్ వైరస్ అన్నందుకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మందలించిన విషయం తెలిసిందే. అలా అనడం సరికాదంటూ హితవుపలికింది. అయితే.. ఇప్పుడు ఈ కోర్టు కేసు ఎంత వరకు వెళ్తుందో చూడాలి మరి.