ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై యుద్ధం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నడుం బిగించారు. ఇక కరోనా ముప్పును అరి కట్టేందుకు ఒకే ఒక్క మార్గం ఉందన్న మోడీ అది సోషల్ డిస్టెన్స్ ఒక్కటే మార్గమని ప్రకటించారు. ఇక ఆయ ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకు అంటే 21 రోజుల పాటు దేశం అంతటా సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. ప్రతి ఒక్కరు దీనిని ఓ లక్ష్మణ రేఖ మాదిరిగా భావించాలని మోదీ చెప్పారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై బ్రహ్మాండంగా పోరాడుతున్నాయని చెప్పిన ఆయన రోజు రోజుకు పెరిగి పోతోన్న కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని ఆయన అన్నారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా విజయం సాధిస్తామని మోదీ అన్నారు. ప్రతి ఒక్కరు ఇందుకు సహకరించాలన్నారు. కరోనాపై యుద్ధం చేసేందుకు రు. 15 వేల కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు.
కరోనా సంక్రమించిందన్న విషయం ముందు ఎవరూ గుర్తించలేరన్నారు. వ్యాధి లక్షణాలున్న వారే కాకుండా అందరూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. తాను ప్రధానిగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిలా చెబుతున్నానని, ఈ మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక వ్యక్తి నుంచి వేల మందికి వైరస్ వ్యాపించవచ్చని అన్నారు.11 రోజుల్లోనే లక్ష నుంచి రెండు లక్షల మందికి సోకిందని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు వెల్లడించాయని చెప్పారు. ఎవ్వరూ కూడా సొంత వైద్యం చేసుకోవద్దని.. వైద్యుల సూచనల మేరకే మందులు వేసుకోవాలని సూచించారు. ఏదేమైనా మోదీ ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడంతో దేశంలో కరోనా తీవ్రత ఎలా ఉండబోతోందా ? అర్థం చేసుకోవచ్చు.