ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారితో అనేక సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లాక్డౌన్లో ఉన్నాయి. ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇదే సయమలో ఆయా దేశాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా తమ సేవలను నిలిపివేసింది. *వినియోగదారుల అవసరాలను తీర్చడమే ప్రథమ ప్రాధాన్యం, వీలైనంత త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తామని హామీ ఇస్తున్నాం* అని ఫ్లిప్ కార్ట్ సంస్థ ప్రకటించింది. *ప్రస్తుతం కష్ట కాలంలో ఉన్నాం. అందరూ సురక్షితంగా ఉందాం. తద్వారా జాతికి సాయ పడదాం. ఇంట్లోనే ఉంటూ మనల్ని మనల్ని కాపాడుకుందాం* అంటూ ఒక ప్రకటన జారీ చేసింది.
కాగా, కరోనా వైరస్ ప్రకంపనలు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. బుధవారం నాటికి 4,22,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,887 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక భారత్లో 500పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 10మంది మరణించారు. తాజాగా.. తమిళనాడులో ఒకరు కరోనాతో మృతి చెందారు. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కరోనా వైరస్ కట్టడికి ప్రజలు సహకరించాలని ఆయన కోఆరు. ఇక ఇటలీలో మరణమృదంగం కొనసాగుతోంది. ఇప్పటికే వేలమంది మృతి చెందారు. అమెరికాలో కూడా కరోనా ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. కాగా, కరోనా వైరస్ పుట్టిన చైనాలో మాత్రం పరిస్థితులు కొంతమేరకు అదుపులోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.