ప్రపంచ మహమ్మారి కరోనా పంజా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ చతికల పడుతున్నాయి. వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరగగా, వేల కోట్లలో ఆర్ధిక నష్టం జరుగుతోంది. ఈ దుస్థితి ఇంకెంత కాలం ఉంటుందో, ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అయితే మన ఇండియా ఇప్పటికే లాక్డౌన్ అయ్యింది. ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఇంకా 21 రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగనుంది. తరువాత పరిస్థితి సద్దుమణిగితే ఒకే గాని, లేదంటే దాన్ని ఇంకా పొడిగించే పరిస్థితి లేకపోలేదు.
ఆ కారణంగా... ప్రభుత్వ ఆఫీసుల దగ్గరి నుంచి, ప్రైవేట్ కంపెనీల వరకూ అన్ని సంస్థలూ బంద్ కాక తప్పలేదు. ఇక బ్యాంకులలోను అదే పరిస్థితి నెలకొంది. సిబ్బందిని తగ్గిస్తూ పలు బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు లావాదేవీల విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈఎంఐ, లోన్లు, ఇతర చెల్లింపుల విషయంలో సదరు కస్టమర్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఈ ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో చిరు వ్యాపారస్తులు, రోజు కూలీల ఆదాయ మార్గాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆ కారణంగా.. లోన్లు, ఈఎంఐల విషయంలో కాస్త సడలింపు కావాలని, NBFC Association రిజర్వు బ్యాంకును కోరింది. అందువలన.. ఈఎంఐ, లోన్ల నుండి, భారతీయ రిజర్వు బ్యాంకు రిలాక్సేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన ఒకటి వెలువడాల్సి వుంది.
ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతున్న పలు సమస్యలను దృష్టిలో ఉంచుకొని, అందరికీ ఉపయోగపడేలా ఓ భారీ ఆర్థిక ప్యాకేజీని అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. ఇక ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో... ఏటీఎంలలో మనీ విత్డ్రా ఛార్జీలు రద్దు చేయడమే కాక, బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను కూడా.. తొలిగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి అందరికీ విదితమే.