ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను హడలెత్తిస్తోన్న కరోనా వైరస్కు బ్రేకులు వేయడం ఏ దేశానికి సాధ్యమయ్యేలా లేదు. ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచంలోనే జనా భా పరంగా రెండో పెద్ద దేశంగా ఉన్న భారత దేశాన్ని సైతం హడలెత్తిస్తోంది. మన దేశంలో 130 కోట్ల మంది భారతీయులు ఇప్పుడు కరోనాను ఎదుర్కోనేందుకు సమష్టిగా సమర శంఖం పూరిస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు సీఎంలు ముందుగానే లాక్ డౌన్లు ప్రకటించారు.
ఇక ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏకంగా వచ్చే నెల 14వ తేదీ వరకు అంటే ఏకంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశం అంతా ఈ లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. ఇక తెలంగాణలో కరోనా కాస్త విజృంభించే దశంలోనే ఉంది. ఇక్కడకు విదేశాల నుంచి ఎక్కువ మంది వస్తుండడమే ఇందుకు కారణం. ఇప్పటికే అక్కడ రోడ్ల మీదకు వచ్చిన వారిని లాఠీలతో వాయిం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఇప్పటి వరకు ఉన్న కరోనా లెక్కలు చూస్తే బుధవారం సాయంత్రానికి ఇలా ఉన్నాయి.
ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 270 మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 8 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక 229 నెగిటివ్ కేసులు వచ్చాయి. ఇక మరో 33 వెయిటింగ్ రిపోర్టులు ఉన్నాయి. ఏపీలో తొలి కేసు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరానికి చెందిన యువకుడికి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన ఆ యువకుడికి పాజిటివ్ రావడంతో అతడిని అధికారులు క్వారంటైన్ చేసి మరీ అతడికి నెగటివ్ వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఒక్క వైజాగ్లోనే ఏకంగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఏపీ అంతా కాస్త ప్రశాంతంగా ఉన్నా వైజాగ్ నగరంలోనే ముగ్గురికి పాజిటివ్ రావడంతో అక్కడ కాస్త టెన్షన్ వాతావరణం ఉంది.