కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహా మహమ్మారి, దీని ముందు పుట్టిన వైరస్ కంటే అతి పెద్ద అమ్మమ్మ ఈ వ్యాధి. ఇది సోకిన వారు గరిష్టంగా అయిదు వేల మందికి పరోక్షంగా అంటించేందుకు సాధనం అవుతారని తెలుపుతున్న నివేదికలతో కరోనా అంటే అతి పెద్ద కలకలం రేగుతోంది.
ఈ మహమ్మారిని ఇప్పట్లో నివారించడం అసాధ్యం, కానీ నియంత్రించడం సులువు. ఇదిలా ఉంటే కరోనా విషయంలో ఇంతవరకూ భయం కొలిపే సమాచారమే వ్యాప్తి చెందుతూ వచ్చింది. ఇపుడు మాత్రం కరోనా ముప్పు తగ్గుతుందన్న శుభకరమైన వార్తలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి.
అందులో అగ్రగణ్యుడిగా జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ ని చెప్పుకోవాలి. ఆయన నోబెల్ అవార్డు విజేతగా ఉన్నారు. ఆయన కరోనా వ్యాప్తిని చైనా దేశం నుంచే గమనిస్తూ వస్తున్నారు. అక్కడ ఆ వ్యాధి తీవ్రత, విస్తరణ, ఆ విధంగానే ఇతర దేశాలకు వ్యాపించడం వంటివి, అక్కడ కరోనా వల్ల పెరుగుతున్న కేసులు, సంభవిస్తున్న మరణాలు ఈ మొత్తం విషయాన్ని కేసు స్టడీగా ఆయన సంపూర్ణ అధ్యయనం చేశారు.
ఆయన అంచనాల మేరకు కరోనా వైరస్ వ్యాపి ఇకపై మందగిస్తుంది. ఒక్కసారి కాకుండా దశలవారీగా కరోనా కేసులు విస్తరణ తగ్గుతూ వచ్చి మెల్లగా క్షీణిస్తుందని అంటున్నారు. చైనాలో మొదట వీర విహారం చేసిన కరోనా ఆ తరువాత ఆగిపోయిన సంగతిని ఆయన గుర్తు చేస్తున్నారు. అదే తరహాలో ఇతర దేశాల్లో కూడా కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందని, తొందరలోనే ఆ పరిణామాన్ని అంతా చూడబోతున్నారని చెప్పుకొచ్చారు.
ఈలోగా జనం చేయల్సినది సామాజిక దూరం పాటించడమేనని ఆయన అంటున్నారు. మరో వైపు కరోనా నివారణ వైరస్ కూడా తొందరగా కనిపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద జీవభౌతిక శాస్త్రవేత్త మైఖేల్ లెవిట్ అంచనాలు నిజం కావాలని అంతా వేయి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు.