కరోనా కేసులు తెలంగాణలో పెరుగుతున్నాయి. మిగిలిన దేశంలోని కేరళ, మహారాష్ట్ర స్థాయిలో కాకపోయినా క్రమంగా కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజా లెక్కల ప్రకారం చూస్తే.. తెలంగాణలో ఇప్పటి వరకూ తెలంగాణ పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరింది. తాజాగా హైదరాబాద్ లో ఓ మూడేళ్ల పసివాడికి కరోనా సోకిందన్న వార్త కలకలం రేపుతోంది. కరోనా పసిపిల్లలనూ వదలడం లేదన్న కఠోర వాస్తవం వెల్లడైంది.
సాధారణంగా కరోనా ప్రభావం పిల్లలపై,యువకులపై తక్కువ. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే అక్కడకక్కడా పిల్లలకూ కరోనా సోకినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బాలుడితో సహా ఇటీవల సౌదీ అరేబియా వెళ్లి వచ్చింది. ఆ తరవాత బాలుడిలో జలుబు, దగ్గు లక్షణాలు కనిపించాయి. దీంతో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చేసిన పరీక్షల్లో ఆ పసివాడికి కరోనా ఉందని తేలింది.
ఇప్పుడు ఆ పసివాడికి తల్లిదండ్రులకూ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వీరికి కూడా కరోనా తప్పకుండా సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే వారిని క్వారంటైన్ చేశారు. హైదరాబాద్ వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వ్యక్తి ఇటీవలే లండన్ నుంచి వచ్చారు. ఆయనకు కూడా కరోనా వచ్చినట్టు ఇంతకు ముందే నిర్థరణ అయ్యింది. తాజాగా ఆయన భార్యకు కూడా పరీక్షలు చేయించగా.. ఆమెకు కూడా కరోనా వచ్చినట్టు తేలింది.
దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41కు చేరుకుంది. అయితే వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. ఇప్పటి వరకూ వాడుతున్న మందులనే వీరిపై ప్రయోగిస్తూ వారి ఆరోగ్యం కాపాడుతున్నారు. ఇప్పటికే గాంధీ నుంచి తొలి కరోనా బాధితుడు కోలుకుని ఇంటికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple