ఓడిన చోట గెలవడంలోనే అసలు సిసలైన మాజా ఉంటుంది.. ఆ గెలుపులో ఉండే సంతృప్తే వేరు. అలాంటి గెలుపుతో వచ్చిన క్రేజ్ వేరు. ఓడిన చోట పోరాటం చేసి తనను ఓడించిన వాళ్లను కూడా తన వైపునకు తిప్పుకోవడంలోనే అసలు సిసలైన రాజకీయం ఉంటుంది. ఇవన్నీ ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఓ లైడీ ఎమ్మెల్యేకు నూటికి నూరు శాతం వర్తిస్తాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జొన్నగలగడ్డ పద్మావతి టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిపై 46 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన ఈమె టీడీపీ అభ్యర్థి యామినీబాల చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. నియోజకవర్గంలో సేవా గుణాలు కలిగిన వ్యక్తిగా, విద్యావంతురాలుగా మంచి పేరు ఉండటం... 2019లో సులభంగానే ఈమెకు గెలుపు సొంతమైంది.
1979 జూన్ 18న జన్మించిన పద్మావతి స్వస్థలం నెల్లూరు. ఎంటెక్ చదివిన పద్మావతి లెక్చరర్ గాను పని చేశారు. శింగనమల మండలం ఈస్ట్ నరసాపురంకు చెందిన ఆలూరి సాంబశివారెడ్డిని ఈమె వివాహం చేసుకున్నారు. గత తొమ్మిదేళ్ల నుండి నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఈమె మంచిపేరు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో శింగనమల నుండి పోటీ చేసి ఓడిపోయినా వైసీపీ తరపున తన వాయిస్ ను వినిపించుకుంటూ వచ్చారు. 2014 ఎన్నికలకు ఆమె రెండేళ్ల నుంచే నియోజకవర్గం అంతా కలియ దిరిగారు. ప్రతి ఇంటిని టచ్ చేసి వచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓటమి తర్వాత ఆమె కుంగిపోలేదు. ఓడిన చోట గెలవాలన్న పట్టుదలతో ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో అప్పటి అధికార పార్టీ ఆగడాలపై ఎన్నో పోరాటాలు చేశారు.
రాజకీయ ధురంధరుడు జేసీ దివాకర్రెడ్డికి పట్టున్న (గతంలో ఆయన ఇక్కడ సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు) ఈ నియోజకవర్గంలో ఇప్పుడు జేసీలనే మరిపించేలా ఆమె రాజకీయం చేస్తున్నారు. పదవి లేకపోయినా ఆమె ప్రజల్లో ఉన్న తీరు జగన్ను ఎంతో ఆకట్టుకుంది. అందుకే పాదయాత్ర చేస్తున్నప్పుడు పద్మావతి ఈ సారి కూడా సీటు నీదే నువ్వ గెలిచి సగర్వంతో అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని సూచించారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆమె ఏకంగా నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీకి వెళ్లారు.
2014 ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలను తన వంతు సహాయసహకారాలు అందిస్తూ వైసీపీ శింగనమల ఇన్చార్జ్ గా కొనసాగారు. నియోజకవర్గంలో టీడీపీ తప్పులను ఎత్తిచూపుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1978 నుంచి ఎస్సీకి రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. ఎమ్మెల్యే అయిన రోజు నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రజల్లో పద్మావతి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ప్రకటిస్తూ పార్టీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య జగన్ ప్రవేశపెట్టటంపై "‘నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి.. నీ నవ్వు వరం.. నీ కోపం శాపం.. నీ మాట శాసనం" అని జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
అదే సమయంలో నారా లోకేశ్ అసలు ఏ మీడియంలో చదువుకున్నారో అర్థం కావడం లేదని, ఆయనకు తెలుగు, ఇంగ్లిష్.. రెండూ రావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐదు నెలల క్రితం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తిస్తే.. తమకు తెలియబరచాలని టోల్ ఫ్రీ నంబర్ ఇస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎమ్మెల్యే చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఎమ్మెల్యే పద్మావతిపై ప్రశంసల వర్షం కురిపించారు.