కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోయారు. అయితే.. రోజువారీగా కూలిపనులు చేసుకునేవాళ్ల బాధలు మాత్రం అన్నీఇన్నీ కావు.. రోజూ పనికి వెళ్తేనే పూటగడిచే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అనే కుటుంబాలు తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అన్నార్తుల ఆకలి తీర్చేందుకు రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాలను యథాతథంగా కొనసాగించనుంది. అంతేగాకుండా.. ఈ అన్నపూర్ణ కేంద్రాల్లో ఉచితంగా పేదలకు భోజనం అందజేయనుంది. నిర్ణయించిన సంస్థ, ఇప్పుడు ఆ కేంద్రాల్లో ఉచితంగా భోజనం అందజేయనుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మేయర్ బొంతు రామ్మోహన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి గ్రేటర్ హైదరాబాద్లోని 150 అన్నపూర్ణ కేంద్రాల వద్ద పేదలకు ఉచితంగా భోజనం అందజేస్తామని ఆయన ప్రకటించారు. లాక్డౌన్ వల్ల ఎవరూ ఆకలితో బాధపడవద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. అలాగే.. హాస్టళ్లలో ఉండే వారు, వర్కింగ్ పర్సన్లకు జీహెచ్ఎంసీ తరపున ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామని రామ్మోహన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ వ్యాప్తంగా పేదలు ఇబ్బందులు పడకుండా వారికి అవసరమైన నిత్యావసరాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. అలాగే.. మంత్రి కేటీఆర్ కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు వివరిస్తూ లాక్డౌన్పై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, సామాజిక దూరం పాటించాలని ఆయన సూచిస్తున్నారు.