చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణకు నిర్భయ లాంటి చట్టాలు చేసినా మృగాళ్లలో మార్పు రావడంలేదు. ఈ క్రమంలోనే దేశంలో మహిళల భద్రత గాల్లో దీపంలా తయారైంది. ప్రస్తుతం వారిపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు యావత్ దేశాన్ని ఆలోచనలో పడేసింది. అయితే ఎన్ని కఠిన చట్టాలు చేసినా దేశంలో మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. కరోనా వైరస్ భయంలో దేశమంగా లాక్డౌన్ అయినా కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగలూటి చెంచుగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా భర్తకు అనారోగ్యం ఉండడంతో బాధిత మహిళ స్థానిక ఆసుపత్రిలో చూపించింది. మంగళవారం మరోసారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సదరు మహిళ ఆటో కోసం బయటకు వచ్చింది. అయితే అప్పటికే ఆమెపై కన్నేసిన అదే గూడెంకు చెందిన గుర్రప్ప అనే యువకుడు ఆటో తాను చూపిస్తానని నమ్మించాడు. ఇక వరుసకు తమ్ముడే కావడంతో ఆమె అతడి మాటలు నమ్మి అతడి బైక్పై వెళ్లింది.
అయితే దారిలో బైక్ ఆపి గుర్రప్ప ఆమెను తన కోరిక తీర్చాలని కోరాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. దీంతో గుర్రప్ప ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక బాధితురాలు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఇంటికి చేరుకుంది. అయితే బుధవారం ఆమె భర్త పరిస్థితి విషమంగా మారడంతో 108కు సమాచారమిచ్చింది. మరోవైపు బాధితురాలికి కూడా ఆరోగ్యం బాగోలేదని గుర్తించిన సిబ్బంది ఆమెను ప్రశ్నించగా.. ఆ ముందు రోజు జరిగిన దారుణ ఘటన గురించి చెప్పి విలపించింది. దీంతో 108 సిబ్బంది దంపతులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక ఆ తర్వాత బాధితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.