కరోనా కట్టడికి ఆ మహిళా సర్పంచ్లు నడుంబిగించారు. తమ గ్రామాల్లోకి ఆ మహమ్మారి రాకుండా ఏకంగా దారిలో కర్రచేతబట్టి కాపలా ఉంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దాదాపుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాల మహిళా సర్పంచ్లు ఏకంగా తమ గ్రామాలకు ఇతరులెవరూ రాకుండా కాపలా కాస్తున్నారు. అంతేగాకుండా.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా అప్రమత్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భీమునిగూడెం గ్రామసర్పంచ్ మడకం పోతమ్మ తన గ్రామానికి తానే రక్షణగా ఉండడం అందరినీ ఆలోచింపజేస్తోంది.
పోతమ్మ ఓ చేతిలో కర్ర పట్టుకొని గ్రామంలోకి ఎవరు రాకుండా, గ్రామం నుంచి ఎవరూ బయటకు పోకుండా అప్రమత్తంగ ఉంటున్నారు. గ్రామస్తులైనా సరే ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకు మాత్రమే కూరగాయల కోసం వెళ్లేందుకు ఆమె అనుమతి ఇస్తున్నారు. 9 గంటలు దాటాక ఎవరూ రావడానికి వీలు లేదని హెచ్చరికలు జారీచేస్తున్నారు. మడకం పోతమ్మ ఇప్పుడు అనేక గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే, నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని మదపురం గ్రామ సర్పంచ్ ఉడుత అఖిల కూడా తన గ్రామానికి రక్షణ గా ఉంటున్నారు. రోడ్డుకు అడ్డంగా కర్రలు వేసి, అక్కడే చేతిలో కర్రపట్టుకుని ఎండలోనే కాపలా కాస్తున్నారు. మహిళా సర్పంచ్లు కాపలా కాస్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారికి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది.
ఇలా మహిళా సర్పంచ్లే ఎంతో ధైర్యంగా పల్లెలకు కాపలాగ ఉంటున్న నేపథ్యంలో మరికొందరు ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తూ ఇతరులెవరూ గ్రామాల్లోకి రాకుండా అప్రమత్తంగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఎవరైనా సొంత గ్రామస్తులు ఇతర ప్రాంతాల నుంచి వస్తే.. వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందిస్తూ.. కరోనా కట్టడికి తమవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.