కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసిన క్రమంలో చైనా మరో తప్పుడు నిర్ణయం తీసుకుంటోందా..? ప్రపంచానికి మున్మందు మరింత ముప్పు తప్పదా..? అంటే అతర్జాతీయ పరిశోధకులు ఔననే అంటున్నారు. చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా కరోనా వైరస్ పుట్టింది. గత ఏడాది డిసెంబర్ 31న ఈ వైరస్ను గుర్తించారు. అతివేగంగా ఈ వైరస్ వుహాన్ నగరాన్ని అతలాకుతలం చేసింది. వేలాదిమంది దీనిబారినపడ్డారు. అయితే.. వెంటనే అప్రమత్తమైన చైనా ప్రభుత్వం రెండు నెలలపాటు నగరాన్ని షట్డౌన్ చేసింది. కేవలం పదిరోజుల్లోనే పెద్ద ఆస్పత్రి నిర్మించింది. కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే.. ఈ సమయంలో ప్రపంచంలోని మిగతా దేశాలు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.. ఆ.. తమదాకా వస్తుందా.. తమకేం కాదులే అని నిర్లక్ష్యం ప్రదర్శించాయి. ఎంతసేపూ చైనా తీసుకుంటున్నచర్యలను ప్రశించాయిగానీ.. తమదేశాల్లో కూడా రక్షణ చర్యలు తీసుకోవడాన్ని మరిచిపోయాయి. ఇక చూస్తూ ఉండగానే.. ఈ వైరస్ ప్రపంచ దేశాలను చుట్టేసింది. లక్షలాదిమంది ప్రజలు ఈ వైరస్తో బాధపడుతున్నారు. ఇప్పటికే సుమారు 20వేల మందికిపైగా ఈ వైరస్తో మృతి చెందారు.
అయితే.. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.. కరోనా వైరస్కు మారు పేరుగా మారిన వుహాన్ నగరం ప్రస్తుతం కోలుకుంటోంది. కొద్దిరోజులుగా అక్కడ పాజిటివ్ కేసులు నమోదు కావడం దాదాపుగా జీరోకి వచ్చింది. ఇదే సమయంలో మిగతా దేశాలు అల్లకల్లోలం అవుతున్నాయి. కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్డౌన్ విధించాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎక్కడికక్కడ స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఇక ఇటలీలో అయితే మరణ మృదంగం కొనసాగుతోంది. ఆ తర్వాత స్పెయిన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అయితే.. చైనా ప్రభుత్వం ఇప్పుడు వుహాన్నగరంలో షట్డౌన్ ఎత్తేస్తోంది. పాఠశాలలను, అన్ని సంస్థలను తెరుస్తోంది. ఆంక్షలను ఎత్తివేస్తోంది. ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్న అంతర్జాతీయ పరిశోధకులు మాత్రం ఇలా చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికిప్పుడు ఆంక్షలను ఎత్తివేస్తే.. అది మరింత ముప్పుకు దారితీస్తుందని, ఆగస్టు నెలాఖరులో కరోనా వైరస్ మరోసారి విజృంభించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. తెరిచిన పాఠశాలలను, సంస్థలను మళ్లీ మూయాల్సిన పరిస్థితులు తప్పకుండా వస్తాయని అంటున్నారు. ఒకవేళ.. షట్డౌన్ను ఏప్రిల్ మొత్తం కొనసాగిస్తే.. ఆ ముప్పు నుంచి కోలుకోవడానికి మంచి సమయం దొరుకుతుందని సూచిస్తున్నారు. కోలుకోవడానికి కొంత సమయం దొరుకుతుందని చెబుతున్నారు. అయితే.. చైనా మాత్రం కరోనా కేంద్రబిందువు వుహాన్ నగరంలో షట్డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తోంది చూడాలి మరి.