కరోనా వైరస్ రోజురోజుకూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రెండుమూడు దేశాలు తప్ప మిగతా దేశాలన్నింటినీ అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే సుమారు దీనిబారిన పడి మృతి చెందిన వారి సంఖ్య సుమారు 25వేలకు చేరువలో ఉంది. ఇక బాధితుల సంఖ్య ఐదు లక్షలు దాటిపోయింది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలన్నీ కూడా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాయి. సగానికిపైగా దేశాలు లాక్డౌన్లో ఉన్నాయి. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండ స్వీయనిర్బంధ విధించాయి. ఇటలీ, స్పెయిన్, ఇరాన్లో అయితే కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతోంది. ఆదేశంలో ఇప్పటికే వెయ్యిమందికిపైగా మృతి చెందారు. లక్షకు చేరువలో బాధితులు ఉన్నారు. ఇక భారత్లో కూడా కరోనా వైరస్ ప్రభావం క్రమంగా వేగం పుంజుకుంటోంది. దీని బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే శుక్రవారం నాటికి 17మంది మృతి చెందగా బాధితుల సంఖ్య ఏడువందలకుపైగా దాటింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏప్రిల్ 14వ తేదీ వరకు భారత్లో లాక్డౌన్ కొనసాగుతుంది. ఇదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి. కరోనా వ్యాప్తి నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఒకవైపు బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూనే.. కొత్తవారు కరోనా బారిన పడకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా లాక్డౌన్ను కట్టుదిట్టంగా అములు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనాపై పోరుకు ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. దీని కోసం చేపట్టిన ఆపరేషన్కు కొత్త పేరును పెట్టింది. కొవిడ్-19 ఆపరేషన్స్కు *ఆపరేషన్ నమస్తే* అన్న పేరును సూచించారు. ఆపరేషన్ నమస్తే పేరుతో భారత సైనిక దళం అన్ని ఆపరేషన్స్ చేపడుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 8 ప్రాంతాల్లో క్వారెంటైన్ కేంద్రాలను ఆర్మీ ఏర్పాటు చేసి, కరోనా వ్యాప్తి నిరోధానికి తనవంతు కృష్టి చేస్తోంది.