బాబోయ్.. ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశమే.. ఎందుకంటే.. జనవరి 18వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు భారత్లోకి వివిధ దేశాల నుంచి 15లక్షల మంది వచ్చినట్లు తాజాగా.. సెంట్రల్ కేబినెట్ సెక్రటరీ ప్రకటించారు. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. వీరందరినీ మానిటరింగ్ చేయాలని కోరారు. చైనా దేశంలోని వుహాన్నగరంలో కరోనా వైరస్ కలకలం రేపుతున్న సమయంలో, ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సమయంలోనే వీరందరూ వచ్చారన్నమాట. ఈ సంఖ్యను చూస్తే మాత్రం మరింత ఆందోళన కలగకమానదు. ఎందుకంటే.. ఇప్పుడు వీరందరిలో చాలా వరకు ఎక్కడ ఉన్నారో కూడా అధికారయంత్రానికి తెలియదు. వీరందరినీ మానిటరింగ్ చేయాలంటూ సెంట్రల్ కేబినెట్ సెక్రటరీ రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
నిజానికి.. ఇతర దేశాలతో పోల్చితే.. భారత్లో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షల రేట్ చాలా తక్కువగా ఉంది. చాలా నెమ్మదిగా పరీక్షలు జరుగుతున్నాయి. వేగంగా నిర్ధారించే సామర్థ్యం లేదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం... మార్చి 25వ తేదీ రాత్రి 8గంటల వరకు కేవలం 24,254 మందిపై 25,144 పరీక్షలు మాత్రమే నిర్వహించింది. వీరిలో మొత్తం 581 మందికి మాత్రమే పాజిటివ్ అని తేలింది. అంటే నిర్ధారణ పరీక్షల రేట్.. పదిలక్షల మందికిగాను కేవలం 18మంది చొప్పున మాత్రమే పరీక్షలు జరుగుతున్నాయి. ఈలెక్కన విదేశాల నుంచి వచ్చిన ఆ 15లక్షల మందిలో సగం మందికి పరీక్షలు నిర్వహించాలన్నా ఇంకా ఎంతసమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇదే సమయంలో చైనా, ఇటలీ, యూకే, అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షల రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఆయా దేశాల్లో ఇప్పటికే లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. అందుకే ఆ దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంతే వేగంగా పెరిగింది. భారత్లో పరీక్షలు చాలా స్లోగా జరుగుతున్నాయి కాబట్టి.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా చాలా తక్కువగా నమోదు అవుతోంది. తాజాగా..ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఏకంగా 15లక్షలు ఉందంటూ సెంట్రల్ కేబినెట్ కార్యదర్శి ప్రకటించడంతో.. నిర్ధారణ పరీక్షలు చేయడానికి ఎంత సమయం పడుతుందో మరి..! అయితే.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేవలం ఎయిర్పోర్టుల్లోనే స్ర్కీనింగ్ టెస్ట్ చేసి, చేతిపై స్టాంప్ వేసి, వేలమందికి తమతమ ఇళ్లలోకి పంపించారు. వీరందరినీ ఇప్పుడు మానిటరింగ్ చేయడం అంటే అంత సులభం కాదు సుమా..!