కరోనా కలకలం భారతదేశంలో కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 724 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వల్ల దేశంలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయినట్లు తెలిపారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, నలుగురు మృతి చెందినట్లు చెప్పారు. కాగా, ఇలాంటి సంక్లిష్ట తరుణంలో కీలక నిర్ణయం వెలువడింది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశంలో టెలీమెడిసిన్ విధానంలో వైద్యసేవలు అందించటానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీచేసింది. కరోనాకు ఇది సరైన చికిత్స అని పేర్కొంటున్నారు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన ఈ మార్గదర్శకాల ప్రకారం, వీడియో సమావేశం, ఫోన్ సంభాషణ లేదా మెసేజ్ల ద్వారా వైద్యులు రోగులకు వైద్య సలహాలను అందించే అవకాశం కలుగుతుంది. భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనా వైరస్పై పోరుకు టెలీమెడిసిన్ అద్భుతంగా సాయం చేయనుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు, దేశంలోని పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ఇన్సూరెన్స్ ప్రకటించారు. పది వేల వెంటిలేటర్లు కావాలని పీఎస్యూలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. సుమారు 30 వేల అదనపు వెంటిలేటర్లు కావాలని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. రెండు నెలల్లోగా వీటిని ఏర్పాటు చేయాలని కోరినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. వలస కూలీలకు ఆహారం, నీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని ఆయా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యా సలిలా శ్రీవాత్సవ్ తెలిపారు. హోటళ్లు, కిరాయి ఇళ్లు తెరిచి ఉంచాలన్నారు. కోవిడ్19 జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలన్నారు. సుమారు 1.4 లక్షల కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.