కరోనా...ఇప్పుడు ఈ వైరస్ బారిన పడిన వారు ఎందరున్నారో...ఈ వ్యాధఙ భయంతో వణికిపోతున్నవారు అంతకంటే ఎన్నో వందల రెట్లున్నారు. అందుకే పల్లె పట్నం అనేతేడా లేకుండా జనాలు ఈ వైరస్ గురించి చర్చించుకుంటున్నారు. తమకు తెలిసిన వారికి సోకి ఉంటుందేమో అని వణికిపోతున్న వారి సంఖ్య కూడా ప్రముఖంగానే ఉంది. అయితే, ఇలాంటి వారికి సంబంధించిన ఉపయుక్తమైన సమాచారం ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్యాండెమిక్గా (ప్రపంచవ్యాప్త వ్యాధి) ప్రకటించడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ మహమ్మారికి బీమా సౌలభ్యం కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) కరోనాకు చికిత్స విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. అనంతరం, ఎస్బీఐ జనరల్, బజాజ్ అలియాంజ్, ఎడల్వీస్ జనరల్, సిగ్నా మణిపాల్ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రకటించాయి. కరోనా ట్రీట్మెంట్ ఖర్చులను భరిస్తామని, క్వారంటైన్ ట్రీట్మెంట్ ఖర్చులనూ క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపాయి. కొత్తగా ఏర్పడ్డ డిజిట్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు మాత్రం కరోనాకు పాలసీలు ఇస్తున్నాయి.
కాగా, ఐఆర్డీఏ బీమా కంపెనీలకు ఇచ్చిన ఆదేశాల వల్ల ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఆయా కంపెనీలు పాలసీల్లో కరోనాకూ కవరేజీ ఇచ్చే ఇన్సూరర్స్ ఇలాంటి బీమా క్లెయిములను త్వరగా పరిష్కరించాలని ఆదేశించింది. కరోనా క్లెయిమ్స్ను తిరస్కరించడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించింది. దీంతో, ప్రస్తుతానికి మెజారిటీ కంపెనీలు కరోనా ట్రీట్మెంట్ ఖర్చులను భరిస్తామని చెబుతున్నా, కేసులు పెరిగి, పరిస్థితి విషమిస్తే మాత్రం వెనకడుగు వేసే అవకాశాలు ఉంటాయి. కేసులు పెరిగే కొద్ది ట్రీట్మెంట్, టెస్టుల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎక్కువ మంది క్లెయిమ్ చేసుకుంటే కంపెనీలకు నష్టాలు పెరుగుతాయి.
ఇదిలాఉండగా, కరోనాతో కోట్లమంది రోజుకూలీలు ఉపాధి కోల్పోయారు. లక్షల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది. బ్యాంకుల్లో లోన్లు తీసుకొని వ్యాపారాలు చేసుకొని, ఆస్తులు కొనుక్కున్నవారు నెలనెలా వాయిదాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అదీకాక ఇప్పడు చిన్నచిన్న కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. దాంతో తమ విలువైన కస్టమర్లను కష్టసమయంలో ఆదుకొనేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు ముందుకొచ్చాయి. కస్టమర్లకు ప్రత్యేక అత్యవసర లోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ప్రకటించాయి