కరోనా గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. మనోళ్లే కాదు.. ఇండియా అంతా ఇదే కథ. అసలు ఈ కరోనా జనవరిలోనే బయటపడినా ఇప్పుడు ఇంతగా జనం భయపడటానికి అసలు కారణం ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలే. ఆ దేశాల్లో ఇప్పుడు రోజూ వందల మంది చనిపోతున్నారు. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అందుకే ఇండియా కూడా తక్కువ మరణాలు ఉన్నా లాక్ డౌన్ ప్రకటించింది.
అయితే మొదట్లో కరోనాను లైట్ గా తీసుకున్న దేశాలు ఇప్పుడు అందుకు ఫలితంగా దారుణంగా తయారయ్యాయి. అలాంటి దేశాల్లో ఇప్పుడు బ్రిటన్ కూడా చేరింది. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో కరోనా విపరీతమైన వేగంతో వ్యాపిస్తోంది. అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో చైనా, ఇటలీని అమెరికా దాటుతోంది.
బ్రిటన్లో కరోనా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 115 మంది మరణించారు. మృతుల సంఖ్య 100 దాటడం ఇదే ఫస్ట్ టైమ్ . మొత్తంగా దీంతో వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 759కి చేరగా.. బాధితుల సంఖ్య 15 వేలకు చేరువైంది. కఠిన చర్యలు తీసుకోవడంలో తొలినాళ్లలో బ్రిటన్ వెనుకాడింది. ఇప్పుడు అందుకు బ్రిటన్ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. అంతే కాదు.. త్వరలో బ్రిటన్ మరో ఇటలీగా మారే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఆరు లక్షలకు చేరువ అవుతోంది. ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నవారు లక్షా 30 వేల మంది ఉండగా... చనిపోయిన వారి సంఖ్య 27000కు చేరువవుతోంది. ఈ మహమ్మారికి ఇంకెన్ని ప్రాణాలు బలికావాలో..? ఈ వైరస్ కు మందు ఎప్పుడు వస్తుందో అని జనం ఎదురు చూస్తున్నారు.