కొవిడ్-19 అమెరికాను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా.. ప్రపంచ దేశాల్లో అమెరికాలోనే కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అయింది. శుక్రవారం రాత్రి వరకు పాజిటివ్ కేసులం సంఖ్య ఏకంగా లక్ష దాటింది. మరణాల సంఖ్య 1500కు చేరింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. అమెరికాలో కరోనా విజృంభన ఏ స్థాయిలో ఉందో.. ఇక అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ పూటగడుపుతున్నారు. మున్ముందు అమెరికాలో పరిస్థితులు మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తి నిరోధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక చర్యలు తీసుకుంటున్నారు.
అయినా.. పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రమూ అదుపులోకి రావడం లేదు. రోజురోజుకూ మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక అక్కడి ప్రధాన నగరాల్లో న్యూయార్క్లో సంక్లిష్ల పరిస్థితులు నెలకొన్నాయి. న్యూయార్క్లో 44,700, న్యూజెర్సీలో 8,800, కాలిఫోర్నియాలో 4,200, వాషింగ్టన్లో 3,200, ఫ్లోరిడాలో 2, 900, మిచిగాన్లో 2,800, లూసియానాలో 2,700, ఇల్లినాయిస్లో 2,500, మాసాచుసెట్స్లో 2,400 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంటే.. ఒక్క న్యూయార్క్లోనే కేసుల సంఖ్య యాభైవేలకు చేరువలో ఉండడం గమనార్హం.
అమెరికాలో కేసుల సంఖ్య లక్ష దాటడంతో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అమెరికా పౌరులను ఆదుకోవడానికి, అక్కడి రంగాలకు చేయూత నివ్వడానికి అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే 2ట్రిలియన్ డాలర్ల కరోనా ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస్ బారిన పడిన వారికి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూనే.. మిగతా వారు కరోనా బారిన పడకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచంలోని 64దేశాలకు యూస్ 174మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందులో ఇండియాకు 2.9మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందనున్నట్లు వార్తలు వస్తున్నాయి.