కరోనా వైరస్ భారత్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. గడిచిన 24 గంటల్లో( మార్చి 28 ఉదయం 9గంటల వరకు) మనదేశంలో ఏకంగా 149 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కావడం. ఈ సంఖ్యను చూస్తేనే అర్థంమవుతుంది భారత్లో కరోనా ఎలా విజృంభిస్తుందో..! దీంతో కరోనా కేసుల సంఖ్య శనివారం ఉదయం వరకు 873కి చేరుకుంది. మరణాల సంఖ్య 19కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. అయితే.. మున్ముందు ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. దేశంలో గత ఒకటి రెండు రోజుల నుంచి నిర్ధారణ పరీక్షల్లో వేగం పెరిగిందని, అందుకు తగ్గట్టే.. పాజిటివ్ కేసులు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. మున్ముందు కేసుల సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉన్నందున అందుకుతగ్గట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అనేక ఆస్పత్రులను కేవలం కొవిడ్-19పేషెంట్లకు సేవలందించేందుకే కేటాయిస్తున్నారు. తాజాగా.. భారత సాయుధ దళాలకు చెందిన 28 ఆస్పత్రులను కూడా కొవిడ్-19కే కేటాయించారు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. కేవలం నిత్యావసర సరుకులు, అత్యవసర పనుల కోసమే ప్రజలు అది కూడా ఇంటికి ఒక్కరు చొప్పున బటయకు వస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా క్వారంటైన్లో ఉన్న వారి సంఖ్య వేలల్లోనే ఉంది. వీరందరికీ కేసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, ఇదే సమయంలో సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించడం ఒక్కటే మనల్ని కరోనా నుంచి కాపాడుతుందని చెబుతున్నారు.