వైరస్ లో ఎన్నో రకాలు. అవి మానవాళి మీద దాడి చేస్తూనే ఉంటున్నాయి. ఒకదానికి మందు కనిపెడితే మరోకటి పుడుతూ వస్తోంది. మానవుడు మేధస్సు ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా దాని సవాల్ చేసేలా వైరస్ లు వీర విజ్రుంభణ చేస్తూనే ఉన్నాయి. ఎంతో సాంకేతిక సంపత్తి ఉందని చెప్పుకుంటున్న వర్తమాన కాలంలో కూడా వైరస్ బారిన పడి జనం చనిపోతున్నారంటే షాకే మరి.
ఇదిల ఉండగా ప్రతి వందేళ్ళకూ ఒక రకమైన భయంకరమైన వైరస్ వ్యాప్తి చెందుతూ మానవాళి మీద పగపడుతోంది. 1720 నుంచి ఇప్పటివరకూ చూసుకుంటే కలరా, ప్లేగు వంటివి అప్పట్లోనే లక్షల్లో బలి తీసుకున్నాయి. ఇక 1920 ప్రాంతంలో స్పానిష్ వైరస్ అన్నది ప్రపంచాన్ని పట్టి కుదిపింది. ఈ వైరస్ కారణంగా కూడా లక్షల్లో ప్రజలు మరణాన్ని ఆశ్రయించారు.
ఇక స్పానిష్ వైరస్ అప్పటికి స్వాతంత్ర పోరాటంలో ఉన్న మహాత్మాగాంధీని కూడా వదలలేదు. ఆయన సైతం ఈ వైరస్ బారిన పడి కొంతకాలం ఇబ్బందులు పడ్డారని వందేళ్ళ క్రితం నాటి చరిత్ర చెబుతోంది. అప్పట్లో స్పానిష్ వైరస్ పెను సవాల్ విసిరింది. నాడు అత్యాధునిక వైద్యం లేదు. ఆ కారణంగా చాలా మందిని పొట్టన పెట్టుకుంది.
ఇపుడు చూస్తే కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. ఈ వైరస్ కూడా మందు లేకుండానే మట్టబెడుతోంది. మందు కనిపెట్టేలోగానే ప్రపంచం పెను ముప్పుని ఎదుర్కొనేలా ఉంది. ఈ మొత్తం పరిస్థితిని గమనించినపుడు వందేళ్ళకు ఒక మారు మానవాళిని ఎదిరించేందుకు వైరస్ లు వస్తూనే ఉన్నాయని అర్ధమవుతోంది. వాటిని ధీటుగా తట్టుకుని నిలిచే వైద్యం అందుబాటులోకి తెచ్చుకోవడమే ఇపుడున్న పరిష్కారం.
ఇక కరోనా వైరస్ వంటి వాటి విషయంలొ ప్రస్తుతం మందు లేనందువల్ల సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది. ఇదే ఇపుడు అందరికీ శ్రీరామరక్షగా ఉండనుంది. అందుకే ప్రతీ ఒక్కరూ లాక్ డౌన్ ని కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది.