కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేపట్టాల్సిన చర్యలపై గత శుక్రవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ)ని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ల్యాబ్ గా ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు. కేవలం తెలంగాణలోని వారికే కాకుండా దేశ వ్యాప్తంగా ఎక్కడి వారికైనా పెద్ద సంఖ్యలో ఇక్కడ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ప్రధాన మంత్రి దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు.
అయితే, తాజాగా సీసీఎంబీకి సంబంధించిన పలు కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ చెప్పినట్టు హైదరాబాద్ సీసీఎంబీ ల్యాబులో రోజుకి వెయ్యి కరోనా టెస్టులు చేసే సామర్ధ్యం ఉందని అన్నారు. కరోనా వైరస్ని హ్యాండిల్ చేయగలిగే విధంగా సీసీఎంబీ 25 మంది డాక్టర్లకు శిక్షణ ఇచ్చిందని రాకేశ్ మిశ్రా అన్నారు. 5 మెడికల్ కాలేజీల నుంచి వచ్చిన వారికి శిక్షణ ఇచ్చామన్నారు.సీసీఎంబీలో రోజుకి వేయి టెస్టులు చేయొచ్చని అన్నారు. అందుకు తగ్గ సామర్థ్యం సీసీఎంబీ సంస్థకు ఉన్నదన్నారు. అవసరమైతే సీడీఎఫ్డీ లాంటి సంస్థల సాయం కూడా తీసుకుంటామన్నారు.
సీసీఎంబీ ప్రయోగశాలలో రోగి శాంపిల్ నుంచి వైరస్ను వేరుచేయగలుగుతామని రాకేశ్ మిశ్రా అన్నారు. వైరస్ను నైపుణ్యంతో హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉందని ఆయన తెలిపారు. తమకు ఉస్మానియా లాంటి ఆసుపత్రులతో టై అప్ ఉందని, వాళ్లు పంపించే శాంపిల్స్ నుంచి విజయవంతంగా వైరస్ ను వేరు చేయగలుగుతున్నామన్నారు. ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కోడానికి అవసరమయ్యే అన్ని ప్రయోగాలు చేస్తున్నామని రాకేశ్ మిశ్రా తెలిపారు. వైరస్ని హ్యాండిల్ చేయాలంటే బయోసెఫ్టీ లెవెల్-3 సౌకర్యం అవసరం. అది సీసీఎంబీలో ఉందని, ఆర్ఎన్ఏ కోసమైతే లెవెల్-2 సరిపోతుందని రాకేశ్ మిశ్రా అన్నారు. వ్యాధిని ఎలా అరికట్టాలో అన్నికోణాల్లో పరిశోధనలు చేస్తున్నామన్నారు. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కల్పించాలని ఆయన కోరారు. వాళ్లే వ్యాధి బారిన పడితే నైతికంగా కుప్పకూలిపోతామని అన్నారు.